Saturday 24 April 2010

దొరికితేనే దొంగ బాబా!!

పాపం నిత్యానంద స్వామి! ఒక నెల క్రింది వరకూ రాజభోగాలు అనుభవించాడు, ఎందరో భక్తులను కూడ గట్టుకున్నాడు. చక్కగా డబ్బున్న భక్తులనుండి సేకరించిన విరాళాలతో ఎన్నో ఆశ్రమాలను స్తాపించి ఆశ్రమాల ముసుగులో తన ఇహలోక కోరికలన్నీ తీర్చుకున్నాడు. భక్తులకి మాత్రం జనన మరణ బంధాల విముక్తి గురించి భోదనలు చేశాడు. సీక్రెట్ కెమెరాల పుణ్యమా అని ఒక్కసారిగా ఆయన జీవితం పూర్తిగా మారిపోయి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.


ఒక్క వీడియోతో ఒక్కసారిగా ఎన్నో కొత్త కేసులు బయటికి రాసాగాయి. నిత్యానంద ఆశ్రమాల మీద దాడులవల్ల ఆయన రాసలీలలపై ఎన్నో ఆధారాలు బయట బడ్డాయి.


అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మన దేశంలో నిత్యానంద ఒక్కడే కాదు, ఇంకా ఎందరో దొంగ స్వాములు, దొంగ బాబాలూ తామే దేవుళ్ళమని చెప్పుకుని వెర్రి జనాలని మోసగిస్తున్నారు. ఇంకా ఎక్కువ విరాళాలు సేకరిస్తున్నారు, ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆశ్రమాలమాటున ఎన్నో ఇల్లీగల్ చర్యలకు పాల్పడుతున్నారు. వారిని టచ్ చేసే ధైర్యం మీడియాకి గానీ, న్యాయవ్యవస్తకి గానీ ఇంకా రాలేదు.


పోనీ ఈ ఇతర బాబాలమీద ఇప్పటివరకూ ఆరోపణలు ఏమీ లేవా అంటే అలా కాదు. వీరిపై నిత్యానందపై వచ్చిన ఆరోపణలకంటే పెద్ద ఆరోపణలు ఎన్నో వచ్చాయి. మరి ఎందుకు ఎవరూ వీరి గురించి అడిగే సాహసం చెయ్యరూ అంటే కారణం వారు నిత్యానంద లాగా అడ్డంగా దొరికిపోలేదు. వారిపై ఇంతకుముందు వచ్చిన వీడియోలు నిత్యానంద లాగ క్రిస్టల్ క్లియర్గా కనపడలేదు. అందుకే ఈ బాబాలెవరూ పూర్తిగా దొరకక దొంగ బాబాలుగా కాక నిజం బాబాలుగా చలామనీ అవుతున్నారు.


మొత్తానికి నిత్యానంద ఎపిసోడ్ ఫలితంగా మీడియాలో దొంగ బాబాలగురించిన వార్తలు గత నెలరోజులుగా పెరిగాయి. అయితే ఇవి కేవలం ఏ కాళేశ్వర్ బాబా లేక మరో చోటా మోటా బాబాకో మాత్రమే పరిమితమయ్యాయి. అంతే కానీ తాము దేవుళ్ళ అవతారాలుగా చెప్పుకునే బడా బాబాల జోళికి మీడియా వెల్లలేక పోయింది.


నిత్యానంద ఎపిసోడ్ కంటే కొద్దిరోజులు ముందుగా కల్కి అమ్మ భగవాన్ గురించిన వార్తలు కొన్ని చానెల్స్లో వచ్చాయి. ఆ వార్తలలో చూపించినది మీడియా సొంత ఇన్వెస్టిగేషన్ కాదు, కొంతమంది మాజీ భక్తులు కల్కి బాగోతాన్ని వీడియో తీసి మీడియాకి ఇచ్చారు.


నిజానికి కల్కి భగవాన్ పైన వచ్చిన అరోపణలు నిత్యానంద కంటే సీరియస్ ఆరోపణలు. నిత్యానంద కేవలం ఒక సినీ తారతో రాసలీలలు జరిపి దొరికిపోయాడు. ఇది చట్టపరంగా నేరమేమీ కాదు. కాని ఆ వీడియో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పోలీస్ వ్యవస్థ కూడా రంగంలోకి దిగింది, చివరికి నిత్యానందని అరెస్టు చేశారు. అయితే కల్కి భగవాన్ భక్తి పేరుతో భక్తులను మత్తుమందులకి బానిసలు చేస్తున్నట్లు, భక్తులతో మత్తులో ముంచి కామక్ర్రిడలు చేస్తున్నట్లు ఆరోపణలు. అయినా కల్కి భగవాన్ పైన ఎలాంటి చర్యా తీసుకోబడలేదు.


ఇక సత్య సాయి, ఆసరం బాపు, బాల సాయి లాంటి బాబాల జోలికి చట్టం కాదు కదా, వారిని తప్పు పడితే సగం మంది బ్లాగరులే మన మీదికి దాడి చేస్తారు. మరి ఈ బడా దొంగబాబాలు దొరికేదెప్పుడు?

Wednesday 14 April 2010

మహబూబ్ నగర్, నల్లగొండే కాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా అభివ్రుద్ధి చెందలేదు కదా??!!

మహబూబ్ నగర్, నల్లగొండే కాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా అభివ్రుద్ధి చెందలేదు కదా?ఇది సమైఖ్య వాదుల రెగ్యులర్ వాదన. ఎప్పుడు ఎవరైనా తెలంగాణా వాడు నల్లగొండ, మహబూబ్ నగర్ అభివృద్ధి చెందలేదు అనగానే సమైఖ్య వాదులు వెంటనే ఈ వాదన మొదలు పెడతారు. దీనికి తెలంగాణా వాదులు సమాధానం ఇచ్చీ ఇచ్చీ ఇప్పటికే బహుషా విసిగి పోయి ఉంటారు. కానీ సంఖ్యా బలం సమైఖ్య వాదులలో ఎక్కువ కనుక వాల్ల పోస్ట్లుల మధ్య సాధారణంగా తెలంగాణా బక్క గొంతులు వినపడవు. రోజూ లగడపాటి టీవీలో జోరుగా ఇదే వాదన వినిపిస్తాడు. దానికి సమాధానం ఎన్ని సార్లు చెప్పినా ఆయన చెవికెక్కదు. ఈ వితండ వాదాలు చేసే సమైఖ్య వాదులకోసం ఈ టపా!!

నిజమే!! సమిఖ్య వాదుల వాదన అక్షర సత్యం. తెలంగాణా యే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప అన్నీ వెనుక బడినవే. ఇది ఎవరయినా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఇక్కడ గమనించవలసిందేమంటే ఉత్తరాంధ్రా, అనంతపురం, కడప, చిత్తూరు లాంటి జిల్లాలలో జల వనరులు లేవు, వర్షపాతం తక్కువ. అయితే మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సమస్య వీటికి విరుద్ధం. ఇక్కడ పక్కనే క్రిష్ణా ఉండి కూడా ఇవి వెనుక బడ్డాయి. ఒకవేల పంజాబ్, హర్యాణా లను ఎండపెట్టి నీళ్ళన్నింటినీ రాజస్థాన్ కి తరలించారనుకోండి, అప్పుడు పంజాబ్ వాళ్ళు ఊరుకుంటారా? మరి అలాంటప్పుడు రాజస్తాన్ వెనుకబడలేదా నీటిని రాజస్థాంకి తరలిస్తే తప్పేమిటనే వాదన వితండ వాదమే కదా?

ఏ ప్రాంతం ప్రజలకి ఆ ప్రాంతపు వనరులపై అధికారం ఉంటుంది. జలవనరులపై మొదటి హక్కు నదీ పరీవాహిక ప్రాంత వాసులకి ఉంటుంది. అక్కడి ప్రజల అవసరాలు తీరిన తరువాత మాత్రమే వాటిని మిగతా ప్రాంతాలకు కేటాయించాలి. ఈ మాత్రం సమైఖ్య మేధావులకి తెలియదని కాదు, కానీ వాదనలో ఎదుటివారి నోరు మూయించడమే వీరి విధానం, నిజానిజాలు గాలికే వదిలేస్తారు. మహబూబ్నగర్ ఎండిపోతే మాకేంటి, మా కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, అనంతపురం, కడప,చిత్తూరు, మద్రాసు అన్నింటికీ క్రిష్ణా జలాలు కావాలి అనేది వీరి అభిప్రాయం కాబోలు. ఇంకా ఏమన్నా మిగిలితే అవి కడప రాజా గారి సిమెంటు ఫాక్టరీలకు తరలిస్తారు. వడ్డిచేవాడు మనవాడయితే వెనుక వరసలో ఉన్న విస్తరి నిండా అన్నీ బాగానే దొరుకుతాయి మరి.

ఇక సమైఖ్య వాదుల రెండో వాదన.. క్రిష్ణా, గుంటూరు, గోదావరి జిల్లలలో మాత్రం పేదవారు లేరా? పేదరికం ఎక్కడ లేదు అని. అవును, అమెరికా, జెర్మనీలలో కూడా పేదవారు ఉన్నారు. అంత మాత్రాన అవి పేద దేశాలయిపోవు. పేదవాళ్ళెందరు, ధనవంతులెందరు, సగటు ఆదాయం ఎంత అనేవి అక్కడ ముఖ్యం.

ఇక ఇవేవీ నడవకపోతే చివరగా సమైఖ్యవాదులు తమ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. మీ తెలంగాణా జిల్లాలకి నీరు అందకపోతే మీ నాయకులేం చేస్తునారు అనే వాదన బ్రహ్మాస్త్రం. దీనికి తిరుగులేదు..తప్పు అవతలి వాడి పైకి తోసేస్తే సరిపోతుంది. తెలంగాణా నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు ఎన్ని సంవత్సరాలు చేశారేంటి? పొరపాటున ఎవరైనా ఒక్కసారి అయితే వెంటనే వారిని దించడానికి రాయలసీమ, అవనిగడ్డ రౌడీలు హైదరాబాద్ వచ్చేసి గొడవలు చేస్తారు.

ఇవన్నీ సమైఖ్యవాదులకి తెలియవని కాదు. కానీ బయటపడరు. లేకపోతే తమ అధిపత్యాన్ని కాపాడుకోవడం ఎలా?