Friday 25 February 2011

వర్మ చేతిలో క్లీన్‌బౌల్డయిన రజనీకాంత్‌

రోజూ అందరినీ రకరకాల ప్రశ్నలతో కంఫ్యూజ్ చేసి కంగారుపెట్టే TV9 రజనీకాంత్ ఈరోజు రాంగోపాల్‌వర్మ చేతిలో కంప్లీట్‌గా క్లీన్‌బోల్డయ్యాడు. గంటసేపు జరిగిన ప్రోగ్రాంలో కనీసం ఒక్కసారి కూడా రాంగోపాల్‌వర్మకు సమానస్థాయిలో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేకపొయ్యాడు. అనేక సందర్భాల్లో డిస్కషన్ ఎలా నడపాలో తెలియక వెర్రిమొహం వేశాడు. తనవాదనకు పనికొస్తారేమోనని ఇద్దరు మూవీ జర్నలిస్టులని పిలిస్తే వాల్లు ఇంకొంచెం కంఫ్యూషన్ క్రియేట్ చేశారు కానీ ఏవిధంగానూ రజనీకాంత్‌కు సహాయం కాలేకపొయ్యారు.

రోజూ అందరు పబ్లిక్ ఫిగర్లపైనా బురదచల్లి, మల్లీ వారొచ్చి తమపైన వచ్చిన వార్తలను ఖండిస్తే మరొకసారి అదికూడా చూపించి టీఆర్పీ పెంచుకోవడానికి చీప్‌ట్రిక్స్ ఆడే TV9 రాంగోపాల్‌వర్మతో ఎందుకు పెట్టుకున్నామురాబాబూ అనుకునేలా డిస్కషన్ నడిచింది. ఎలాగయినా సరే వర్మను వెధవను చేద్దామని అదే ప్రశ్నను మల్లీమల్లీ ఎపాటిలాగే అడిగిన రజనీకాంత్ ఈసారి మల్లీమల్లీ వెధవయ్యాడు.

రాంగోపాల్‌వర్మ పూర్తి డిస్కషన్‌లో ఒకే పాయింటుపైన ఉన్నాడు. తను తీసే సినిమాలు బాగులేవని విమర్శించొచు, కానీ వర్మ ప్రేక్షకులను వెధవలు అనుకుంటాడని ఆయన తరఫున వీరెలా చెబుతారనే దానికి రజనీకాంత్ దగ్గర సమాధానం లేదు. కాస్సేపు బురద జల్లుడు కార్యక్రమం, కాస్సేపు వర్మకు సలహాలిచ్చే కార్యక్రమం, కాస్సేపు ప్రేక్షకులను రక్షించబోయే కార్యక్రమం చేసి అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇక ఏనాడూ సమాజానికి పనికొచ్చే ఒక్క స్పెషల్ రిపోర్టు చూపించక ఎప్పుడూ పనికిమాలిన డిబేట్‌లు పెట్టి ఒకరినొకరు తిట్టుకునేట్టు చెయ్యడం, లేకపోతే పబ్లిక్‌ఫిగర్లపై బురదజల్లడం చేసి టీఆర్పీ పెంచుకునే TV9 వర్మకు సామాజిక స్పృహ నేర్పే ప్రయత్నం చెయ్యబొయి బోర్లాపడ్డం గమ్మత్తుగా ఉంది. పనిలో పనిగా ఇందులో యండమూరి కూడా ఫూల్ అయ్యాడు.

అసలు లొల్లి మొదలయింది

తెలుగు జాతి కార్డు, సమైఖ్యభావన లొల్లి అంత ఉత్తదే అని తెలిసిపొయిది, సమైఖ్యాంధ్ర ఉద్యమం దొంగ ఉద్యమమనీ తేలిపోయింది, ఇక అసలు లొల్లి మొదలయింది. హైదరాబాదు ఎవరికి చెందుతుందనేదానిపై ఇప్పుడు చర్చ మొదలయింది. హైదరాబాదులో మేము పెట్టుబడులు పెట్టాము, మేం ఇక్కడ స్తలాలు కొనుక్కున్నాము, కబ్జాలు కూడా చేశాము, కనుక ఇప్పుడు హైదరాబాదు మాక్కూడా చెందుతుందని ఒకరంటె, మాకియ్యకపోతెమాయె మీగ్గుడ రాకుండ కేంద్రపాలితప్రాంతం జెయ్యండ్రని ఇంకొకరు. హైదరాబాదులో రిఫరెండం బెట్టాలి, హైదరాబాదు వాసుల అభిప్రాయం తెలుసుకోవాలని ఇంకొకరంటరు.మేము నగరాన్ని విడిచిపెట్టి మీరు పొమ్మంటే పోవాలా అని మరొకరు.

మొత్తానికి ఇదొక మంచిపరిణామం. సీమాంధ్రలో నాయకులు సమైఖ్యత సాధ్యం కాదనే విషయం గ్రహించి విడిపోతే తమకు కావలిసిందేంటో అడిగితే అది మెల్లగానయిన పరిష్కారానికి దారితీస్తుంది. అయితే ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్లు సొంతరాజధాని లేక రాజధాని అవసరంకోసం కలిసినవారు ఇప్పుడు హైదరాబాదులో వాటాను అడగడం బాగాలేదు.

"ఇది హైదరాబాదు, ఇది హైదరాబాదు, ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు" అని ఎవరో కవి చెప్పినట్లు నాటినుంచి నేతివరకు ఎందరో భిన్న జాతుల మనుషులు హైదరాబాదు వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు,పొట్టపోసుకున్నారు, తమ ఐడెంటిటీలను కాపాడుకున్నారు. సింధీలు, మార్వాడీలు,పంజాబీలు, గుజరాతీలు, పార్శీలు,మరాఠీలూ ఇక్కడ స్థిరపడ్డారు, ఇక్కడి ప్రజలతో కలిసిపొయ్యారు. వరికెవరికీ లేని భయాలు ఇప్పుడు కొత్తగా కొందరు సృష్టిస్తున్నారు.

మేమిక్కడ పెట్టుబడులు పెట్టాం, కనుక మాకు హక్కు ఉంటుంది అనేవారికి, హైదరాబాదులో బిల్‌గేట్స్ కూడా పెట్టుబడులు పెట్టాడు అంతమాత్రం చేత ఇది అమెరికాకు ఇచ్చేయం అని తెలియక కాదు. పెట్టుబడులు ఎవరయినా లాభాలకోసం పేడతారు, ఒక నగరం మీద ప్రేమతో కాదు. మన ఓఎన్‌జీసీకి నైజీరియాలో, తజకిస్తాన్ వంటి చోట్ల పెట్టుబడులున్నాయి, అంత మాత్రాన ఆదేశాల్లో మనకు వాటా ఎన్నటికీ రాదు. తెలుగు వారి పెట్టుబడులు ఇక్కడే కాదు, మనదేశంలోని మిగతా పెద్దనగరాలలో చాలా చోట్ల ఉన్నాయి.

ఇక రెండొ విషయం, లేని అపోహలను సృష్టించడం: మాకు రక్షణ ఉండదు,మా మీద దాడులు చేస్తారు, మేము హైదరాబాదు వదిలి ఇప్పుడు వెల్లాలా లాంటి మాటలకు ఎలాంటి అర్ధం లేదు. ఇక్కడి సీమాంధ్రానుండి వచ్చిన ప్రజలు నిర్భయంగా ఉన్నరు, తొందరగా తెలంగాణా వస్తే తలనొప్పి తీరుతుంది అనుకుని అడ్డుపడేవారిని తిట్టుకుంటున్నరు. కానీ వీరికోసం ఎక్కడో ఉండేవారు మాత్రం తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. ఇదేం దేశ విభజంకాదు, కేవలం రాష్ట్ర విభజన. కొత్తరాష్ట్రం ఏర్పడ్డంత మాత్రాన ఎవ్వరినీ ఇక్కన్నుంచి వెల్లమనడం లేదు. బాంబే స్టేట్ నుండి వేరుపడడకోసం మరాఠీలు ఉద్యమించినపుడు అక్కడి గుజరాతీలమీద దాడి చేసినట్లు ఇక్కడ ఎప్పుడూ చెయ్యలేదు.

ఇక ఇంకొంతమంది వాదన మరోలా ఉంటుంది: హైదరాబాదు రాజధానికనుక వచ్చాము, ఇప్పుడు మరెక్కడికి వెల్లాలి అని. రాజధాని కదా అని ఎవరు వెల్లరు, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు ఉన్న ఎక్కడికైనా వెల్తారు, అది రాజధాని కానవసరం లేదు. ఒకవేళ ఆంధ్ర, తెలంగాణా కలవక హైదరాబాదు తెలంగాణా రాష్ట్రం రాజధానిగా ఉంటే ఆంధ్రనుండి ఇక్కడికి వలసవచ్చేవారు కాదు అనుకోవడం పొరపాటు.

ఇక హైదరాబాదు కేంద్రపాలితప్రాంతం కావాలనో, లేక హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలనో అనేవారు ఏదోవిధంగా ఇరకాటు పెట్తాలనుకోవడం తప్పితే అది జరిగేపని కాదని అందరికీ తెలుసు.

చివరగా హైదరాబాదు ప్రస్థుత అభివృద్ధిలో ఆంధ్రా వారికీ వాటా ఉంది అనే వాదన. ఇది కొంతవరకూ నిజంగానే అనిపిస్తున్నా ఆరోజు పెద్దమనుషుల ఉప్పందం యధా ప్రకారం జరిగుంటే తెలంగాణా ఆదాయం తెలంగానాలోనే ఖర్చుపెట్టాలి, అలా చెయ్యకుండా తెలంగాణా ఆదాయాన్ని ఆంధ్రాలో ఖర్చుపెట్తారనేది బడ్జెట్ లెక్కలు చూస్తే తెలుస్తుంది. దానర్ధం హైదరాబాదు ఆదాయాన్ని సీమాంధ్రలో ఖర్చుపెట్టడం జరిగింది కానీ అక్కడి ఆదాయాన్ని హైదరాబాదులో ఖర్చుపెట్టలేదు. కాకపోతే మరో రాజధాని అవసరానికి సీమాంధ్ర నాయకులు కేంద్రాన్ని ఎంతోకొంత ప్యాకేజీ అడగొచ్చు కానీ మిగతావేవీ జరిగేపనికావు.అందుకే ఇన్నిరోజులూ సమైఖ్యగారడీలు!!

Wednesday 23 February 2011

రొట్టెముక్క చిన్నదయితే




ఒక ఇద్దరు స్నేహితులు కలిసి హాలిడేస్ గడపడంకోసం ఒక టూర్‌కు బయల్దేరారనుకుందాం. వెల్తూ వెల్తూ దారిలో కనిపించిన మంచి రష్టారెంటుకు వెల్లి ఇద్దరూ భోజనం ఆర్డర్ చేశారనుకోండి. ఇద్దరికీ కలిపి రెష్టారెంటువాడు రెట్టెలు ఒక బాస్కెట్లో ఇచ్చారనుకుందాం. అప్పుడు ఇద్దరిలో ఎవ్వరూ నువ్వు నాకంటే ఎక్కువ తింటున్నావ్, నావాటాకూడా కొట్టేస్తున్నావ్ అంటూ గొడవ చెయ్యడు. పైగా నువ్వింకాస్త వేసుకో అంతే నివ్వింకాస్త వేసుకో అని ఒకరినొకరు మొహమాటపెట్టుకుంటారు.

అదే వ్యక్తులు టూర్‌కని వెల్లి ఒక అడవిలో తప్పిపొయి తిండిలేకుండా రెండురోజులు తిరుగుతున్నారనుకుందాం. అప్పుడు వారికి ఒక రొట్టె దొరికిందనుకుందాం. అప్పుడు ఇద్దరిలో బలవంతుడు రొట్టె అంతా కాజేసి రెండోవాడికి కొదిగా విదిలిస్తే రెండోవాడికి ఖచ్చితంగా మండుతుంది. అలాగే ఒక నెలరోజులు వాల్లు అదే అడవిలో ఉండి, రోజూ వారికి ఒకే రొట్టెముక్క రేషన్‌లో దొరికితే ఆరొట్టెను బలవంతుడు పూర్తిగా కాజేస్తూ రెండో వాడిని ఎండబెడితే అప్పుడు రెండోవాడు తిరుగుబాటు చేస్తాడు. నీతో కలిసి ఉండడం నాకు సాధ్యంకాదు, నాదారి నేను చూసుకుంటానంటాడు. అప్పుడు బలవంతుడు, చూడు, నా పరిస్థితికూడా అంతబాగా ఏమీలేదు, నేనుకూడా సన్నబడ్డాను, ఈనెలరోజుల్లో ఐదు కిలోలు తగ్గాను అని కబుర్లు చెప్పితే ఫలితంలేదు, ఉన్నంతలో రొట్టెను ఇద్దరూ సమానంగా వాటాలు వేసుకుని పంచున్నారా లేదా నేదే ఇక్కడ సమస్య.

సమైఖ్య రాష్ట్రంలో నీల్లూ, నిధులూ, నియామకాలు రొట్టెముక్కల్లాంటివి, ఇవి విడిగా ఎవ్వరికీ పూర్తిగా సరిపోవు. అందుకే వీటి వాటాలలో ఎంతవివక్ష జరుగుతున్నా ఇంకా సీమాంధ్రలో పలుచోట్ల పేదరికం అలాగే ఉంది. ఇప్పటికిప్పుడు ఈరొట్టెముక్క పెద్దది చెయ్యడం సాధ్యం కాదు, సహజవనరులు ఉన్నవి పరిమితం. ఇప్పుడు సమస్య ఈ వనరులను న్యాయబద్దంగా పంచుతున్నారా లేదా అని. అంతేకానీ సీమాంధ్రలో కూడా ఫలానాచోట పేదరికం ఉంది కాబట్టి మీరు ప్రత్యేక రాష్ట్రం అడగడానికి వీల్లేదు అనే వాదన సరికాదు.

సమైక్యంగా ఉండడంవల్ల ఒక రొట్టె రేషన్ వస్తే విడిపోవడం వల్ల చెరి సగం రొట్టె వస్తుంది. అంటే బలహీనుడికి న్యాయం జరుగుతుంది. బలవంతుడికి అప్పటిదాకా తేరగా సంపాదిస్తున్న అదనపు భాగం రాదు. అందుకే వాడికి కలిసి ఉండడం కావాలి.

తెలంగాణాకు సీమాంధ్ర దళిత, బీసీల మద్దతు

నెల్లూరులో ఫిబ్రవరి 20న జరిగిన దళితమహాసభ రాష్ట్ర విభజనకు తమ మద్దతు ప్రకటించింది. దళిత మహాసభ ఫౌండర్ కత్తి పద్మారావు అధ్యక్షతన జరిగిన ఈ దళితమహాసభ రాష్ట్ర విభజనకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిసి ఉద్యమనిచాలని పిలుపునిచ్చింది. సమైఖ్య రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగడంలేదు, కేవలం కొన్ని అగ్రకులాలవారే ఆధిప్త్యం చేస్తున్నారు, దళితులపై దాడులు మానడంలేదు. రాష్ట్ర విభజన జరిగితేనే దళితులకు న్యాయం జ్రుగుతుందని వారు స్పష్టం చేశారు. సమీక్యాంధ్ర JAC దళితమహాసభ వారిని విభజనకు మద్దతు ఇవ్వొద్దని కోరినా, వారు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వార్తను డెక్కన్ క్రానికల్‌లో ఇక్కడ చూడవచ్చు. తెలుగు మీడియా మాత్రం దళితమహాసభ గురించి ఎక్కడ ప్రస్తావించినట్లు లేదు.

ఇప్పటికే బీసీ నాయకుడు ఆర్.క్రిష్నయ్య అధ్యక్షతలోని బీసీ ఐక్యవేదిక తెలంగాణాకు మద్దతు ప్రకటించింది. సీమాంధ్రకు చెందిన దళిత, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది ఇప్పటికే బహిరంగంగా విభజనకు మద్దతు ఇవ్వగా కొంతమంది మద్దతు ఇస్థున్నా ఇంకా బయటపడట్లేదు. విభజన కోరుతున్న సీమాంధ్ర నాయకులలో బొత్సా సత్యనారాయణ, హర్షకుమార్, మోపిదేవి వెంకటరమణ ప్రముఖులు.

సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణాలోనయినా, సిమాంధ్రలోనయినా అగ్రకులాలదే అద్ధిపత్యం. సమైఖ్య రాష్ట్రంలో పెద్ద నెట్‌వర్క్‌తో బలంగా ఉన్న దోపిడీ వ్యవస్థను ఎదిరించడం కష్టం, చిన్నరాష్ట్రాలయితేనే సులువు అనేది వీరి వాదన. చిన్న రాష్ట్రాలను కోరిన అంబేద్కర్ ఆశయం కూడా ఇదే ధోరణిలో ఉంది. ఎనభై శాతం ఉన్న దళిత, బీసీలు సీమాంధ్రలో తెలంగాణాకు మద్దతు ఇస్థుండగా మరి సమిఖ్యవాదం ఎవరికోసం? ఇరవై శాతం మించని అగ్రకులాలకోసమేనా?

Thursday 17 February 2011

ఒక ఖండన, ఒక దండన

ఖండన:

ఈరోజు జయప్రకాష్ నారాయణ్ గారిపై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరం మరియూ గర్హణీయం. మన రాష్ట్ర శాసనసభలో విలువలూ, ఆదర్శాలూ, ఉన్నత భావాలూ కలిగిన వ్యక్తిగా చెప్పబడే జేపీకి ఇలాంటి అవమానం జరగడం అందరికీ అవమానమే. ఇలాంటి సంఘటన తెలంగాణా వాదానికి కూడా నష్టం జరిగించే విషయం. ఇలాంటి ఘటణలవలన ఉద్యమాం ప్రజలలో చులకన అయ్యే అవకాశం ఉంది.

చేతనయితే పూటకో మాట చెప్పి చివరికి కేంద్రప్రభుత్వ ప్రకటన రాగానే తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడిన చంద్రబాబుపైనో, లగడపాటి పైనో, జగన్‌పైనో, చిరంజీవిపైనో దాడిచేద్దాం. లేదా తెలంగాణాలో ఉంటూ ద్రోహం చేస్తున్న డీ.శ్రీనివాస్, జగ్గారెడ్డి లాంటివారిపై దాడి చేద్దాం. తెలంగాణా వచ్చినా రాకపోయినా తెలంగాణా ప్రజలకు కాస్త తృప్తి మిగులుతుంది, జేపీపై ఎందుకు దాడికి దిగడం? జేపీ తెలంగాణాపై పూటకో మాట చెప్పలేదు, తెలంగాణా ఏర్పాటుకు అడ్డుచెప్పలేదు.

దండన:

జేపీ గారూ, ఈరోజు మీపై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరం. అయితే ఇందులో మీరు ఆత్మ విమర్శ చేసుకావాల్సిన అవసరం కూడా ఉందేమో ఆలోచించండి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రతినిధిగా ఉన్న మీరు ఎప్పుడూ ఒక బ్యూరోక్రాట్‌లాగా ఎందుకు వ్యవహరిస్థారు? మీ మేధావితత్వం ముసుగులో వివక్షను ఎందుకు చూపుతారు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజల మనోభావాల ప్రకారం నడుచుకునే భాద్యత మీకు లేదా? అలా చెయ్యకపోతే ప్రజానాయకుడికి బ్యూరోక్రాట్‌కు తేడా ఏముంది? సీమాంధ్రలో ప్రజల రియాక్షన్‌తో సంబంధంలేకుండా నేతలు కృత్రిమ ఉద్యమం తయారు చేసి తెలంగాణాకు అడ్డుపడ్డరు. మీరిక్కడ ప్రజలంతా ఉద్యమిస్తుంటే ఏటికి ఎదురీది మీ నియోజకవర్గం కూడా వెల్లలేని పరిస్థితి తెచ్చుకోవడం ఎంతవరకూ సబబు?

మీరెప్పుడు ఆదర్శాలు వల్లిస్తారు, నీతులు చెబుతారు. అయితే మీ నీతివచనాలలో వివక్ష ఎందుకు? గత అసెంబ్లీ సమావేశాలలో అన్ని పార్టీలవారూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తే (సీమాంధ్ర ప్రతినిధులతో సహా) మీరు మాత్రం కేసులు ఎత్తివేయవద్దని వాదించారు. మరి సమైఖ్యాంధ్ర ఉద్యమం పేరుతో కేవలం పదిహేనురోజుల్లో కోట్ల ఆస్థుల ధ్వంసం జరిగినప్పుడు అక్కడ ఎవరిపైనా కేసులు ఎందుకు లేవు, అరెస్టులు ఎందుకు జరగలేదు అని మీరెందుకు ప్రశ్నించరు? అదే తెలంగాణాలో మాత్రం ఒక్కో విద్యార్థిపై వందలకొద్ది కేసులు ఎందుకు పెట్టారు, ఒకే సమయమ్ళొ వేర్వేరు చోట్ల కేసులు పెట్టడం ఎలా సాధ్యం? ఈ వివక్ష ఎందుకు అని ప్రశ్నించారా? మీరు చెప్పింది నిజం: నేరం చేసినట్టయితే కేసులు ఎందుకు ఎత్తివెయ్యాలి? కానీ ఆ నేరాల్ని నమోదు చెయ్యడంలోనే వివక్ష ఉంటే ఏమి చెయ్యడం?

అంతా చక్కగానే ఉంటే అసలు ఎలాంటి ఉద్యమాల అవసరం లేదు. కానీ ప్రస్తుత వ్యవస్థలో ఏదీ సరిగాలేదు. మీ నీతులు ఎందుకు సెలెక్టివ్‌గా ఉంటాయి? అధికారాన్ని పూర్తిగా గవర్నర్ హస్తగతం చేసుకుని శాసిస్తుండగా, హోం మినిష్టరు మాటలు ఖాతరు చెయ్యకుండా ఉస్మానియాలో కాల్పులకు ఆదేశాలు ఇవ్వగా అవేవీ పట్టకుండా గవర్నర్ ప్రసంగం విషయంలో మాత్రం నీతి వచనాలు ఎందుకు? మీరెప్పుడూ చెబుతుంటారు "21వ శతాబ్దంలో ఉద్యామాలా" అని, మరి 21వ శతాబ్దంలో కూడా ఉద్యమాలు చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించండి.

Sunday 13 February 2011

ప్రేమికుల దినం వచ్చింది ప్రేమికులారా జాగ్రత్త!!


వాలైంటెయిన్స్ డే వచ్చింది, ఇక మల్లీ డ్రామా మొదలవుతుంది. పార్కుల్లోనూ, కాఫీ క్లబ్బుల్లోనూ ఎక్కడయినా ఒక అమ్మాయి, అబ్బయి కనింపించారంటే చాలు, స్వయంప్రకటిత మోరల్ పోలీసులు వచ్చి తరిమి కొడతారు లేదా పెళ్ళిల్లు చేస్తారు. అక్కడ కలిసి ఉంది అన్న చెల్లెల్లు కావొచ్చు, ఆటో డ్రైవరు, ఒక ప్రయాణీకురాలు కావొచ్చు ఇంకెవరయినా కావొచ్చు. ఎవరయినా సరే తాళి కట్టి తీరాల్సిందే.

గత సంవత్సరం నాకు గుర్తున్న వార్తలు: ఒక అమ్మాయి ఏదో పరీక్షకోసం వెలితే తోడుగా ఇంకో అబ్బయి వెళ్ళి మధ్యలో కాస్త టైముంటే పార్కులో కూర్చున్నారు, వారికి తీళి కట్టించేశారు. ఒక అమ్మాయి ఆటోను ఎంగేజ్ చేసుకుని కాస్త వేచి ఉండాల్సి రావడంతో ఆటొ డ్రైవరుతో పార్కుకెలితే వారితో కూడా తాళి కట్టించారు. రేపిలాంటి వార్తలు ఎన్ని వినాలో! సంవత్సరమంతా ప్రేమికులు రోజూ పార్కుల్లో కూర్చుని ముద్దూ ముచ్చటలాడుకోవచ్చు, ఎవరూ పట్టించుకోరు. కానీ ఒకా ఫిబ్రవరి 14 రోజు మాత్రమే ఏ జంట ఎక్కడా కనపడకూడదు. ఆ రోజు కనపడితే తాళి కట్టడానికి రడీగా ఉండాలి.
మనదేశంలో ఒక గుంపుతో కలిసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమమయినా చెయ్యొచ్చు. అది ప్రభుత్వ అస్తిత్వానికి, అధికారంలో ఉన్న వారికి కావలిసినవారికి ఆర్ధికంగా నష్తపరచనంతవరకూ ఎలాంటి చర్యలూ ఉండవు.

ఒక జెస్సికా లాల్, ఒక ఆయేషా మీరా



ఒక జెస్సికా లాల్: డెల్లీకి చెందిన ఒక అప్‌కమింగ్ మోడల్. అప్పర్ మిడిల్ క్లాసుకు చెందిన జెస్సికా ఒక చెల్లెలు, తల్లి దండ్రులతో కలిసి ఉండేది. ఒకానొక పార్టీలో అంతా చూస్తూ ఉండగా ఒక హై ప్రొఫైల్, డబ్బూ, అధికారమూ కల వ్యక్తి చేత చంపబడింది. ముందుగా ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చెయ్యడం జరిగింది. ముద్దాయికి శిక్షపడడం కోసం ముద్దాయి చెల్లెలూ, తల్లితండ్రులూ తమ శాయశక్తులా కృషి చేశారు. ప్రత్యక్ష సాక్షులను బతిమాలి, బామాలి కేసును నడిపించారు. కొంతమంది సిన్సియర్ పోలీసులు కూడా కేసు నిరూపణకోసం కష్టపడ్డారు.

కానీ ఆ తరువాత సాక్షులంతా ఒక్కొక్కరుగా బెదిరింపబడడం వల్లనో, డబ్బు వల్లనో కేసులో అడ్డం తిరిగి సాక్షాన్ని ఉపసంహరించుకున్నారు. ఫోరెన్సిక్ సాక్షాలు తారుమారు చెయ్యబడ్డాయి.కోర్టులో కేసు కొట్టివెయ్యబడింది. అంత సులభంగా కేసునుండి ముద్దాయి తప్పించుకోవడం చూసిన కొంతమంది మీడియా వారు ముద్దాయిలు తప్పుడు సాక్షాలు ఇచ్చినట్లుగా నిరూపించారు. డెల్లీ ప్రజలు మీడియాకు మద్దతు ఇచ్చారు. కేసు మల్లీ ఓపెన్ చెయ్యబడింది. ఎలాగయితేనేం చివరికి జెస్సికాకు న్యాయం జరిగింది, ముద్దాయికి శిక్ష పడింది.

ఒక ఆయేషా మీరా: విజయవాడకు దగ్గర్లో ఒక పేద కుటుంబానికి చెందిన ఆయేషా ఒక చిన్నపాటి ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ బీఎస్సీ చదివేది. ఒకరోజు రాత్రి హాస్ట్లల్లోనే అత్యంత కిరాతకంగా చెరచబడి ఆ తరువాత హత్యకు గురయింది. ఒక హాస్టల్లో ఉన్న అమ్మాయిని హాస్టల్లో జఓబడి చెరిచి చంపినప్పుడు ఖచ్చితంగా అక్కడి వారికి, హాస్టల్ వార్డెన్, వాచ్‌మన్, మిగతా రూంమేట్స్కు తెలియకుండా ఆ సంఘటన జరగడం అసాధ్యం. కానీ ప్రత్యక్ష సాక్షులెవరూ ఎలాంటి సాక్షమూ చెప్పలేదు.హంతకులు హై ప్రొఫైల్, డబ్బూ, అధికారము కల ఒక మాజీమంత్రి మనవడని హతురాలి తల్లి ఆరోపణ. అయితే వారి ఆరోపణల ఆధారంగా ఎలాంటి విచారణా జరగలేదు. హాస్టల్‌లోని మిగతా విద్యార్థులను విచారించే ప్రయత్నం చెయ్యలేదు.

ముందు ఒకడిని హంతకుడని చెప్పి పోలీసులు అరెస్టు చేశారు. అతని తండ్రి ఒక చిన్న లాయర్‌ను పెట్టుకోగల స్థోమత కలిగిన వాడు కావడంతో కేసు నిలవలేదు. ఆ తరువాత మరో చిన్నపాటి చిల్లర దొంగను అరెస్టు చేశారు. అరెస్టు కాబడ్డ వ్యక్తీ, హతురాలి కుటుంబం కూడా పేదవారు, లాయర్‌ను పెట్టుకోనే స్థోమత లేని వారు, మీడియాలో గట్టిగా మాట్లాడే అంత తెగువలేని వారు. హతురాలి తల్లి అరెస్టు కాబడ్డవ్యక్తి హంతకుడు కాదు అని మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. సాక్షాలు, ఆధారాలూ అన్ని తయారు చెయ్యబడ్డాయి. ఇక్కడ ఏ మీడియా కూడా ఆయేషాకు న్యాయం చెయ్యాలని పోరాటం చెయ్యలేదు. చివరికి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిపై ఎలాంటి విచారణ జరగలేదు, మరో అమాయకుడుకి శిక్ష పడింది. ఆయేషాకు న్యాయం జరగలేదు.

నీతి: మనదేశంలో నోరున్న అర్బన్ మధ్యతరగతికి లేటుగా నయినా న్యాయం జరగవచ్చు. కనీసం డబ్బూ అధికారాల బలంతో వీరు పోరాటం చెయ్యగలరు. అర్బన్ మిడిల్ క్లాసుకు మీడియా మద్దతు ఫరవాలేదు. కానీ నోరులేని సామాన్యులకు మాత్రం ఎవరి మద్దతూ లేదు, వీరికి న్యాయం ఎప్పుడూ జరగదు.

Sunday 6 February 2011

మూడేళ్ళలో మెగాస్టార్ నుంచి జోకర్ స్థాయికి



పాపం చిరంజీవి!! మెగాస్టార్‌గా వెలిగినవాడు చివరికి పేకాటలో జోకరైపొయ్యాడు. లక్షలమంది అభిమానుల అభిమానాన్ని కాసిని మంత్రిపదవులకోసం సోనియా వద్ద తాకట్టు పెట్టాడు. ఎలాగైతేనేం, ఎన్నాళ్ళనుండో జెండా పీకేద్దమనుకున్నా బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు గానీ చివరికి జెండా పీకేశాడు, దుకాణం అమ్మేసాడు.

కష్టపడి ఒకోమెట్టూ ఎక్కి సినిమాల్లో చిన్నస్థాయి నుంచి అగ్రస్థానంలోకి వెళ్ళాడు. కానీ కష్టపడకుండానే అధికారంలోకి రావాలనుకొని బుక్కైపొయ్యాడు. సినిమాల్లో డైరెక్టరు చెప్పినట్లు నటించడమే అలవాటు. రాజకీయాల్లో సరైన దర్శకుడు దొరక్క బామ్మర్దికే దర్శకత్వం భాద్యతలు ఇచ్చాడు. బామ్మరిదేమో సినిమా హిట్టైతేనేం, ఫట్టయితేనేం ఓపెనింగు కలెక్షన్లు అదిరిపోతే చాలునని నమ్మే ఫక్తు కమర్షియల్ ప్రొడ్యూసరు. ఇంకేం, సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్లదగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమా తీసి బాక్సులమ్ముకున్నట్లుగా టిక్కెట్లు అమ్మేసి దొరికిపొయ్యాడు.

సామాజిక తెలంగాణా తీసుకొస్తానన్నాడు, తరువాత సమైఖ్యవాదం అందుకున్నాడు. జెండా పీకడం ఎవరికైనా సాధ్యామా అన్నాడు, జెండా పీకేసాడు, సామాజిక న్యాయం తెస్తానన్నాడు, ఇప్పుడేమో కాంగ్రేస్ ద్వారా సామాజికి న్యాయం తెస్తానంటున్నాడు. మాటపై నిలకడలేనివాడికి గౌరవం ఎలా ఉంటుంది?

బహుషా రాజకీయాల్లోకి ఎందుకొచ్చానురా బాబూ అని ఎన్నో సార్లు చిరంజీవి అనుకొని ఉండొచ్చు. సరే ఎలాగో ఇన్నాల్లూ నెట్టుకొచ్చాడు. ఇంకా మూడేల్లు పార్టీని నడపడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితిలో తనను నమ్మి పార్టీలోకి వచ్చిన కార్యకర్తలనూ, టికెట్లు కొనుక్కున్న ఎమ్మెల్యేలనూ నట్టేట్లో వదలకుండా కాంగ్రేస్లో పార్టీని కలపడం ఒక విధంగా మంచిదే. అయితే ఇకనైనా తనకు అచ్చిరాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పి తమ్ముడు పవన్‌లాగా దూరంగా ఉంటే కాస్త మర్యాదన్నా దక్కేది. ఇప్పుడు కాంగ్రేస్ ఇచ్చే మంత్రి పదవికి కక్కుర్తి పడి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాలేనా అని కలలు కంటే మాత్రం చివరికి పేకాటలో జోకర్ కాస్తా కూరలో కరివేపాకు కావడం ఖాయం.

కొసమెరుపు: అసలు చిరంజీవి పార్టీ పెట్టడం తెలుగుదేశాన్ని ఓడించడానికి ఒకానొక వైఎస్సార్ వ్యూహమే, అంతా మొదటినుంచే మ్యాచ్‌ఫిక్సింగే, పీఆర్పీ ఎప్పటికైనా కాంగ్రేస్‌లో కలిసేదే అని చాలామంది ఇంతకుపూర్వం అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాల్లో ఏదయినా నిజం ఉందేమో అని నాక్కూడా డౌటు వస్తుంది.