Monday 31 December 2012

అమానత్‌కు జస్టిస్, ఆయేషాకు ఇన్‌జస్టిస్



ఢిల్లీలో ఒక మెడికో దారుణంగా బస్సులో అత్యాచారానికి గురయి, మృత్యువుతో పోరాడి చనిపోయింది. ఇది చాలా బాధాకరమయిన విషయం, ప్రతిఒక్కరు ఖండించాల్సిన విషయం. ఇలాంటి సంఘటనలు పాల్పడిన వారికి తగిన శిక్షపడాలి అని అందరూ ఒప్పుకునే విషయం. ఈ సంఘటనలో బాధితురాలి కుటుంబానికి నాసానుభూతిని ఇవ్వడం మినహా నేను చెయ్యగలిగిందేదీ లేదు.

అయితే నాకర్ధం కాని విషయం ఏంటంటే రెండువారాలుగా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర యువత ఆమ్మాయికి న్యాయం చెయ్యాలని భీభత్సమగా నిరశనలు చేస్తునే వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్లు ప్రయోస్తున్నారట. ఇంతకూ ఈఆందోళనకారులు ఆశించే న్యాయం ఏమిటి? సంఘటన జరిగిన రెండ్రోజుల్లోగా అందరు నేరస్థులనూ పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. త్వరలోనే విచారణ ముగుస్తుంది, అందరికీ తగి శిక్షలు పడతాయి. ఆనేరస్థులెవరూ బడా బాబులు కొడుకులు గాదు కనుక శిక్ష పడకుండా తప్పించుకోగలరు అనే అనుమానం కూడా ఎవ్వరికీ లేదు. మరి ఆందోళన కారులు ఆశించే న్యాయం ఏమిటి?

ఆసంఘటన జరిగిన తరువాత మరో మూడు సంఘటనలు దాదాపు అలాంటివే ఢిల్లీలోనూ, మరో రెండు బెంగుళూరులోనూ, ఇంకొన్ని యూపీలోనూ జరిగాయని వార్తల్లో వచ్చింది. ఈసంఘటనల్లో నేరస్థుల్ని అరెస్తు చేశారో లేదో కూడా తెలియదు. మీడియా రిపోర్ట్ చెయ్యడం అయితే చేసింది గానీ మిగతా సంఘటనలనేమీ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. జనం కూడా మిగతా సంఘటణలను పట్టించుకోలేదు.  ఢిల్లీ అమ్మాయికి జరగాల్సిన న్యాయం తప్ప మిగతావారికి న్యాయం జరగాల్సిన అవసరం లేదా అనిపిస్తుంది.

కొన్ని సంవత్సరాలక్రితం విజయవాడలో ఆయేషామీరా అనే అమ్మాయిపై హాస్టల్లో ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆకేసులో అసలు నేరస్థులెవరూ కనీసం విచారించినట్లు కూడా లేదు. ఎవడో జేబుదొంగను దొరికించుకుని ఇరికించి జైళ్ళో పెట్టారు. పాపం ఆ ఆయేషాకు న్యాయం జరగాలని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.

అంతకుముందు ఇలాంటిదే మరో సంఘటన ప్రత్యూష అనే జానియర్ ఆర్టిస్టుపై కూడా జరిగింది. అక్కడకూడా ముద్దాయిలు బలమయిన వాళ్ళు కావడంతో శిక్షలు పడ్డట్టులేదు. ఇలాగే ఢిల్లీలో జెస్సికా లాల్ హత్య విషయంలోనూ జరిగింది. కానీ అక్కడ నేషనల్ మీడియా జోక్యం చేసుకోవడంతో అసలు నేరస్థుడికి లేటుగానయినా శిక్ష పడింది.

రోజూ ఇలాంటి సంఘటనలు ఎక్కడపడితే అక్కడ జరుగుతుంటే, ఎందరో బడాబాబుల పుత్రరత్నాలు కేసులు తప్పించుకుంటే ఎన్నడూ రోడ్లపైకి రాని జనం ఇప్పుడు ఈఢిల్లీ అమ్మాయి విషయంలో మాత్రం ఎందుకు వస్తున్నారో? పోనీ ఇప్పుడయినా ప్రజల్లో చైతన్యం వచ్చిందిలే అనుకుంటే ఆతరువాత కూడా అలాంటి సంఘటనలెన్నో జరిగాయే? అయినా నేరస్థులను అరెస్టుచేసి విచారిస్తుంటే ఇంకా ఏం చేయాలి? ఈ అమ్మాయికి ఇంత అటెన్షను రావడానికి కారణం ఆమే ఢిల్లికి చెందినది కావడమా? లేక నేరస్థులు పెద్ద బలమయిన వర్గాల బ్యాకింగ్ లేని వారు కావడం వల్లనా? లేక ఎవరో అమ్మాయిల దుస్తులవిషయంలో కామెంటు చేసినందుకా?

Wednesday 5 December 2012

నార్వేలో బాలల హక్కులు, ఏపీలో బాలలపై హింస


ఉద్యోగనిమిత్తం నార్వే వెల్లిన ఒక తెలుగు దంపతులు తమ కొడుకును హింసించారని అక్కడిపోలీసులు అరెస్టు చేశారు, తరువాత కోర్టు శిక్ష విధించింది. ఇక ఆవిషయాన్ని అదేదో ప్రపంచవింత అయినట్టు గత మూడు రోజులుగా మన టీవీ9, ఏబీఎన్,సాక్షి మొదలగు అన్ని ఛానెల్లూ డిస్కషన్లు పెట్టి ఊదరగొడుతున్నాయి. ఆఖరుకు నేషనల్ మీడియాకూడా దీన్ని కవర్ చేసింది.నార్వే ప్రభుత్వానికి పిల్లలపై ఉన్న శ్రద్ధను అభినందించాల్సింది పోయి అక్కడి చట్టన్నే తప్పు పడుతున్నారు. అసలు దేశంలో ఇదితప్ప  ఇంకో ఇష్యూలేదు అన్నట్టు కేంద్రమంత్రి వాయలార్ రవి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, లగడపాటి అందరూ కంగారుపడిపోతున్నారు.

ఈలోగా యధాలాపంగా పేపర్లు చూస్తుంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మూల ఇంకో వార్త కనిపించింది. నెల్లూరులో ఒకబాలకార్మికుడిని పనిలో పెట్టుకున్న ఒక డాబా వోనరు ఆబాలున్ని తీవ్రంగా కొట్టడంతో బాలుడు చనిపోయాడు. ఆపిల్లవాడి తండ్రి ఇంతకుముందు అదే డాబాలో పనిచేసేవాడట, డాబా వోనరుదగ్గర అతను పన్నెండువేలరూపాయలు అప్పుతీసుకున్నాడట. అప్పుతీర్చక పనిమాన్సేసినందుకు వెట్టిచాకిరీకింద కొడుకును పనిలోపేట్టుకున్నాడా డాబావోనరు.

నార్వేలో పిల్లాన్ని కొట్టినందుకు శిక్షవిధిస్తే ఇదేం విడ్డూరం అనిఊదరగొడుతున్న ఛానెల్లలో ఒక్కటికూడా ఈవార్తను మాత్రం ప్రసారం చేయలేదు. ఎందుకు చేస్తారు? మనదేశంలో బాలకార్మికులు ఉండడం వింతకాదు, వెట్టిచాకిరీ వింతకాదు, పిల్లలను కొట్టడం వింతకాదు, కొడితే పిల్లలు చనిపోవడం వింతకాదు. మరి ఎలాంటి విడ్డూరమూలేని ఆవార్తను ప్రసారం చేస్తే టీవీ ఛానెళ్ళ టీఆర్పీ ఎలా పెరుగుతుంది? అలాంటివర్తలు ప్రసారం చేస్తే జనం మాత్రం ఎందుకు చూస్తారు? ఛానెల్ మార్చి ఏడుపుగొట్టు సీరియల్లు చూస్తారు గానీ?

అయినా ఏఎన్నారైనో జైళ్ళో పెడితే మనకు వార్తగానీ కూలిపని చేసుకునే పిల్లగాడిని కొట్టిచంపితే అది వార్తెలా అవుతుంది? ఎన్నారైలలో మాత్రం ఐటీ ఇంజనీర్లకు ఏమన్నా అయితే వార్తగానీ ఏదుబాయి కెల్లిన కార్మికుడినో జైల్లో పెడితే అది వార్తా?