Saturday 11 August 2012

అమెరికాలో రోడ్డుప్రమాదానికి గురయిన తెలుగువారు


 
ఈరోజు ఐదుగురు తెలుగువారు అమెరికాలో ఓక్లహామాలో ఫ్రీవేపై ఘోరరోడ్డుప్రమాదానికి గురయి అక్కడికక్కడే మరణించారు. ఐదుగురూ హైదరాబాదుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరులు కాగా అందులో ఒకరు వివాహితుడు, మిగతా నలుగురూ ఇంకా పెళ్ళికానివారని నేను చదివిన వార్త సారాంశం.

ఇలాంటి వార్తలు గత కొద్ది సంవత్సరాలుగా చానాసార్లు నేను చదివి ఉంటాను. అమెరికాకు కొత్తగా వెల్లినవారు అక్కడి డ్రైవింగ్‌కు అలవాటు పడకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కారు నడుపుతుండడం వలన ఇలాంటి ప్రమాదాలు ఈమధ్య బాగా పెరిగాయి. నలుగురైదుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రెండుమూడు నెలలకోసం అమెరికాకు వెలితే అందరూ కలిసి ఒక అద్దెకారు తీసుకోవడం సాధారణం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా పరిమితమయిన అమెరికాలో కారులేకపోతే కాళ్ళు లేనట్లే.

నలుగురిలో ఎవరికైనా ఇండియాలో కారు నడిపిన అలవాటు ఉంటే నేను కారు నడుపుతాలే అని మిగతావారికి నచ్చజెప్పి కారు అద్దెకు తీసుకుంటాడు. అయితే ఇండియా డ్రైవింగ్‌కూ అమెరికా డ్రైవింగ్‌కూ చాలా తేడా గనక తప్పులు జరుగుతుంటాయి. సాధారణంగా రూల్స్ సరిగ్గా పాటిస్తే ప్రమాదాలు తక్కువే..కానీ ఫ్రీవేల్లో స్పీడ్‌కు అలవాటు పడాలి. అది కొత్తగా ఇండియానుండి వచ్చినవారికి కష్టం. అలాగే ఇండియాలో ఎలాంటి డ్రైవింగ్ రూల్సూ ఉండవు కనుక కొత్తగా అమెరికా వెల్లినవారికి అక్కడ రూల్స్ ప్రకారం డ్రైవింగ్ చెయ్యడం కష్టమవుతుంది.

ఏదేమైనా ఇలా తరుచూ ప్రమాదాలు జరగడం భాధాకరం. అసలు అమెరికాలో ఇలా పూర్తిగా కారుపై ఆధారపడే వ్యవస్థను ఎందుకు తయారుచేశారో నాకర్ధం కాదు.  యూరప్‌లోలా బస్సులూ, ట్రైన్లూ ఉంటే వారికి ఇలా వచ్చీరాని డ్రైవింగ్‌తో కారునడిపే అవసరం ఉండదు కదా? కనీసం ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపనీలు అమెరికాకు ఒక గ్రూపును పంపినపుడు అందులో ఒకరికైనా అక్కడ డ్రైవింగ్ అలవాటు ఉండేలా చూసుకుంటే బెటరు. అలా వీలుకాకపోతే ప్రత్యేక శిక్షణ అయినా ఇవ్వాలి.