ఉద్యమాలు, నిరశనలు అనేవి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉపయోగించే ఆయుధాలు. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమందరి తరఫునా నిర్ణయాలు తీసుకోవడం కోసం కొందరు ప్రతినిధులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తారు. అలాంటి ప్రభుత్వం తమ న్యాయమైన హక్కులను కాలరాస్తే మనకు ఆప్రభుత్వాన్ని వెంటనే దించివేసే హక్కులేదు, ఐదేళ్ళదాకా ఆగాల్సిందే. కనుక ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమాలు, నిరశనలు చేస్తారు. ఈనిరశనలు బందులూ, రాస్తారోకోలూ, సమ్మెలూ లాంటి అనేక విధానాలద్వారా చేస్తారు.
అయితే ప్రజలు లేని హక్కులకోసం ఉద్యమాలు చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతోందదే. ఆరోజోన్లో ఉద్యోగాలు ఆరోజోన్ వాసుల హక్కు. దానికోసం సీమాంధ్ర వారు బందులు చెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం తమకు లేని హక్కును కోరడమే కాక ఆరోజోన్ ప్రజల హక్కులు హరించడమే. ఈసాంప్రదాయం ఇలాగే కొనసాగితే రేప్పొద్దున రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకోసం కూడా ఇదే సీమాంధ్రులు ఉద్యమాలు చెయ్యగలరు..రాజస్థాన్ వారికి మాత్రం తమ ప్రభుత్వోద్యోగాల్లో అర్హత ఇస్తే ఒప్పుకోరు. ఇలాంటి అన్యాయపు డీమాండ్లను కొందరు చెయ్యడం, వారికి కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం క్షమించరాని నేరం.
అసలు సమైక్యవాదులు అని చెప్పుకునే వారు చేసే ఉద్యమమే ఒక హాస్యాస్పద ఉద్యమం. దీనికి అబద్దాలను జోడించి కావూరి సాంబశివరావు లాంటి నేతలు తెలంగాణవారు తెలంగాణ కావాలనుకుంటే సీమాంధ్రలో ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని విడదియ్యడానికి వీల్లేదని చెప్పడం హాస్యాస్పదం. ముందుగా సీమాంధ్రలో అందరూ సమైక్యరాష్ట్రాన్ని కోరుకోవడమే పచ్చి అబద్దం, ఇక ఒకవేళ ఇది నిజమనుకున్నా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఒక్కపక్షం వారే నిర్ణయించలేరు, అదివారి హక్కు కాదు.
ఒకభాగస్వామ్యం నచ్చనప్పుడు ఒకభాగస్వామి నాకీ పొత్తు నచ్చడం లేదు, నేను విడిపోతాను అని చెప్పగలడు, అలా చెప్పేహాక్కు ఒకభాగస్వామికి ఉంటుంది. అప్పుడు మరో భాగస్వామి మాత్రం విడిపోవడానికి వీల్లేదు, మనం కలిసే ఉండాలి అని చెప్పే హక్కు ఉండదు, ఉండేహక్కల్లా విడిపోయే పక్షంలో తన సమస్యలను పరిష్కరించుకోవడమే.
ఒకవేళ ఇద్దరు భాగస్వాములూ కలిసే ఉందామని ఇష్టపడుతున్నా ఎవరైనా బలవంతంగా విడగొడుతుంటే అప్పుడు ఇద్దరు భాగస్వాములూ కలిసి మేం కలిసే ఉంటామని చెప్పడం ఒక హక్కవుతుంది. దానికోసం, బలవంతపు విభజనకు వ్యతిరేకంగా ఇరు పక్షాలూ కలిసి ఉద్యమించవచ్చు. కానీ ఒక పక్షం వారంతా మేం విడిపోతాం మొర్రో అంటుంటే లేదు మీరు కలిసే ఉండాలని చెప్పడం హక్కు కాదు కదా, ఎదుటి వారి హక్కులను కాలరాయడమే.
ఇలా ఎదుటివారి హక్కులను హరించే ఉద్యమాలను కొందరు చదువుకున్నవారు కూడా సమర్ధించడం, దానికి రాజకీయనాయకులు వత్తాసు తెలపడం మాత్రమే కాక ఆనాయకులే ఇలాంటి ఉద్యమాలను సృష్టించడం మనదేశంలో ప్రజాస్వామ్య భావనకే ఒక దెబ్బ. ఇలాంటి దొంగ ఉద్యమాలను లేవదీసేవారు ఎంతమాత్రం క్షమార్హులు కారు.





