Friday 16 November 2012

పాపం పురోహితులు...


--ఘంటా చక్రపాణి



ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువ వివాదాస్పదం అవుతున్నాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మొదలైన గొడవలు‘దేనికైనాడీ’అని మోహన్‌బాబు కుటుంబం నడివీధిలో నిలబడి బ్రాహ్మణులను సవాలు చేయడంతో తారాస్థాయికి చేరుకున్నాయి. ‘వుమెన్ ఇన్ బ్రాహ్మనిజం’ సినిమా బ్రాహ్మణులను ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా అసభ్యంగా చూపిందని, అలాగే దేనికైనాడీ సినిమాలో కూడా బ్రాహ్మణకులాన్ని వెకిలిగాచూపి అవమానించారన్నది బ్రాహ్మ ణ సంఘాల అభియోగం. అయితే ఒకటి రెండు దళిత సంఘాలు మినహా ఈ అభియోగాలను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. మోహన్‌బాబు ఇంటిముందు, సినిమా థియేటర్ల ముందు బ్రాహ్మణులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనల్లో కూడా మిగతా కులసంఘాలు ప్రజాసంఘాలు పాల్గొంటున్నట్టు లేదు. అలాగే రాజకీయ పార్టీలు కూడా బ్రాహ్మణుల ఆందోళనలో భాగం కావడం లేదు. దేవుడికి అపచారం జరిగిందనో, గుడి దగ్గర గొడవ జరిగిందనో ఆందోళనలకు దిగే హిందూ మత ప్రచారక సంఘాలు, పార్టీలు కూడా ఈ విషయంలో పెదవి మెదపడం లేదు. పోనీ బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉన్నారా అంటే అదీ లేదు.

ఇప్పుడు సాగుతున్న ఆందోళనల్లో ఆత్మాభిమానం కలిగిన పేద బ్రాహ్మణులు, కొద్దో గొప్పో ఉద్యమాలతో మమేకమై కదిలిన వాళ్ళు మినహా అగ్రవర్గ బ్రాహ్మణుపూవరూ కనిపించడం లేదు. ఈ బలహీనత తెలిసే మోహన్‌బాబు మరింత రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతున్నా డు. ఈ సినిమా ఎంత రచ్చకెక్కితే ఆయనకు అంత వ్యాపారం జరుగుతుంది. చాలా కాలంగా పరాజయాల పాలై చితికిపోయిన ఆయన కుటుంబానికి ఒక రకంగా బ్రాహ్మణుల ఆం దోళన జీవం పోసింది. ఆ సినిమాల్లో ఏముంది? ఎందుకవి వివాదాస్పదమయ్యాయి? అన్న విషయా లు వదిలేస్తే, ఏ కులాన్నైనా వెకిలిగా చూపడం, అవమానపరిచే రీతిలో కుల పాత్రలను రూపొందించి కథ నడపడం అనైతికం. కానీ తెలుగు సినిమాలో విలన్లు, రౌడీలు తెలంగాణ ప్రాంతం వాల్లైనట్టే పనిమనుషులు ఉత్తరాంధ్ర వాళ్ళో లేక ఇంకొక వెనుకబడిన ప్రాతం వాళ్ళో అయి ఉంటారు. అలాగే దేశ ద్రోహులు, దుర్మార్గులు మైనారిటీలో, దళితులో లేదా బహుజన కులాల వాళ్ళో అయి ఉంటారు. తెలుగు సినిమా మొదటినుంచీ కులాన్ని, మతాన్ని ప్రస్తావించకుండానే ఆయా పాత్రల వేషధారణ వాళ్ళు ఏ కులం వాళ్ళో చెప్పేస్తుంది. పాత సినిమాల్లో స్మగ్లర్లంతా రాబర్ట్‌లో, థామస్‌లో ఉన్నట్టే, వాంప్‌లు లూసీలు, జూలీ లు ఉంటారు. అలాగే ఈ కాలంలో వీధి రౌడీలంతా నర్సింగ్‌లు, శ్రీశైలం పేర్లతోనే ఉంటారు. ఒక్క రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో తప్ప మరెక్కడా ప్రతినాయకులకు అగ్రవర్ణం పేర్లుండవు.

సమాజంలో బ్రాహ్మణులు అగ్రవర్ణాక్షిగేసరులే అయినప్పటికీ సినిమా రం గం మాత్రం వాళ్ళను అల్పులుగానే చూపిస్తోంది. బూతులు మాట్లాడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, చాపల్యం ఉన్నవాళ్ళు, తిండిపోతులు ఇట్లా అనేక అల్పపు పాత్రల్లో వారి వేషధారణ, చేష్టలతోనే చెప్పించే సన్నివేశాల్లో మొదటి నుంచీ బ్రాహ్మణులే కనిపిస్తారు. తెలుగు సినిమా మొదటి నుంచీ బ్రాహ్మణుడిని విదూషకుడిగానే పరిగణిస్తూ వచ్చింది తప్ప ఎప్పుడూ నాయకుడిగా చూపలేదు. దానికి తమిళ సినిమా ప్రభావం, ద్రావిడ ఉద్యమం కూడా ఒక కారణమై ఉండవచ్చు. దానికి తోడు సినిమారంగంలో పెట్టుబడి ఒక కార ణం. తెలుగు సినిమా ఇవాళ ఈస్థాయికి రావడానికి ఒకటి రెండు కులాలు, ఒకటి రెండు జిల్లాలే కారణం. మొదటి నుంచీ కోస్తా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలే సినిమాను ఏలుతూ వచ్చాయి. ఆ తరువాత గోదావరి జిల్లాలు తోడయ్యాయి.

ఈ జిల్లాల్లో హరిత విప్లవం, భూస్వామ్యం, వ్యవసాయరంగ విస్తరణ, అభివృద్ధి, అది తెచ్చిన సంపద నేరుగా మద్రాస్‌కు వెళ్లి పెట్టుబడిగా మారి సినిమా రంగాన్ని ఆక్రమించింది. అప్పటిదాకా గ్రామాల్లో పెత్తనం సాగించిన భూస్వాములు, రైసు మిల్లర్లు, చిన్న చితకా రాజకీయ నాయకులు నేరుగా నిర్మాతలుగా, కొంత తెలివితేటలు ఉన్న వాళ్ళు డైరెక్టర్లు గా మారిపోయారు. మొదట నాటక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, అభినయం తెలిసిన వాళ్ళు, సినిమాకు పనికొచ్చే వాక్‌శుద్ధి ఉన్నవాళ్ళు బ్రాహ్మణులే అయినందువల్ల వాళ్ళు నటులుగా ఉండేవాళ్ళు. కానీ భూస్వామ్య కుటుంబాల పిల్లలు ఎదిగి వచ్చాక వాళ్ళే కథానాయకులుగా తెరమీదికి వచ్చారు. వాళ్ళే గడిచిన మూడు తరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నా రు.

ఒక దశలో కమ్మ భూస్వామ్య వర్గాలు తెలుగు సినిమా రంగాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నాయి. అయితే దాన్ని గోదావరి జిల్లాల కాపులు తరువాతి కాలంలో కొంతమేరకు నిలువరించే ప్రయత్నం చేశారు. తొలి తరంలో కొద్దో గొప్పో త్రిపురనేని రామస్వామి చౌదరి, రఘుపతి వెంకయ్య లాంటి వారి సంస్కరణవాదుల ప్రభావం ఉండడం, వాళ్ళ సినిమాల్లో కొద్దో గొప్పో సం దేశం, సామాజిక ఎజెండా ఉండేది. తరువాతి కాలంలో ఈ వర్గాలే సినిమా స్టూడియోలు స్థాపించి క్రమక్షికమంగా దాన్నొక లాభసాటి వ్యాపారం చేసుకున్నాయి. మధ్యలో కొంత కమ్యూనిస్టు భావాలున్న వాళ్ళు, ప్రజానాట్యమండలిలో పనిచేసి అభ్యుదయ భావాలున్న అనేకమంది సినిమా రంగంలో చేరి కొంతకాలం ప్రజాపక్షం ఉండే విధంగా చూశారు. ఆ తరం అంతరించిపోయాక సినిమా పూర్తిగా ఏకపక్షమే అయ్యింది. ఈ వ్యాపారులు నేరుగా కులం పేర్లతో నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి కులాల పేర్లు కలిగిన సినిమాలు తీయడం మొదలుపెట్టి వాళ్లే ఆ గ్రామాన్ని, ప్రాంతాన్ని మొత్తం సమాజాన్ని కాపాడేవాళ్లుగా సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు. సినిమా రంగాన్ని శాసిస్తున్న కులాలు, ప్రాంతమే ఇప్పుడు పత్రికలు, టీవీ మాధ్యమాల మీద కూడా ఆధిపత్యం సాగిస్తున్నాయి. మొత్తంగా సమాజం మీద బలమైన భావ ప్రసరణ, ప్రభావం కలిగించే మాధ్యమాలన్నీ ఒకేవర్గం చేతుల్లో ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణులు ఆత్మగౌరవం కోసం చేస్తున్న నిరసన పెద్దగా ప్రచారానికి కూడా నోచుకోవడం లేదు.

తెలుగు సినిమాలో బ్రాహ్మణుల పాత్ర గానీ, భాగస్వామ్యం గానీ లేకుం డా పోవడం దీనికి ఒక కారణమైతే, మొత్తం సామాజిక వ్యవస్థకు వాళ్ళు దూరం కావడమే ఇవాళ్టి దురవస్థకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మాటల రచయితలుగా, కవులుగా, గాయకులుగా చాలాకాలమే ఉన్నా వాళ్ళు పెట్టుబడిదారుడైన నిర్మాత చేతిలో డబ్బుకు దాసోహమైపోయారు. అందుకే మోహన్‌బాబు తన సినిమా కథ రాసింది, నటించిందీ బ్రాహ్మణులేనని దబాయిస్తున్నారు. ఈ మాటే ఒక టీవీ చర్చలో నేను ఏవీఎస్ అనే నటున్ని అడిగితే ‘మేం పొట్టకూటి కోసం నిర్మాతలు ఏం చెపితే అది చేసేవాళ్ళం’ అని చె ప్పారు. అంతే కాదు ‘డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయాల్సి ఉంటుంది’ అని కూడా అన్నారు.

ఆయన మాటల్లో తన నిస్సహాయత కనిపించింది. బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను వేషాలు వేసి బతికేవాళ్ళు అడ్డుకోవాలనుకోవడం భ్రమ. అది వాళ్ళ వృత్తి. నిజానికి సినిమా రంగంలో చిల్లర వేషాల్లో తప్ప బ్రాహ్మణులు పెద్దగా కనిపించరు. బ్రాహ్మణులు అందివచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుని సృజనాత్మక కళారంగాలు వదిలి మిగతా వృత్తులలోకి మారిపోయారు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో, డబ్బులున్న వాళ్ళు వ్యాపారాల్లో, వారసత్వ బలమో బలగమో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో స్థిరపడిపోయారు. ఒక రకంగా ఇప్పుడు సినిమా రంగంలో మిగతా కులాల్లాగే బ్రాహ్మలూ మైనారిటీలే. వాళ్ళు చాలా కాలం కిందే వదిలేసిన రచ నా వ్యాసంగంలో శూద్ర కులాల్లోని సృజనశీలురు చేరిపోయారు. అయినంత మాత్రాన బ్రాహ్మణులను కించపరచవచ్చా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. నిజానికి ఏ కులాన్ని గానీ కులవృత్తిని గానీ కించపరిచే విధంగా చిత్రించడం అవివేకం, హక్కుల ఉల్లంఘన కూడా. అది బ్రాహ్మణులైనా, దళితులైనా, ఇతర ఏ కులమైనా వర్తించవలసిన నియమం. కానీ తెలుగు సినిమా నీతి నియమాలను వదిలేసి ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారమై కూర్చుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఒక బ్రాండ్స్ ఫ్యాక్టరీ! ఆ నాలుగు కుటుంబాల్లోని వారసులను బట్టి కథలు, వాళ్ళ రేంజ్‌కి తగిన మాటలు, పాటలు ఆ మేరకు వందల కోట్ల పెట్టుబడి దానినుంచి వేలకోట్ల వ్యాపారం.

వ్యాపారంలో లాభానష్టాలే ఉంటాయి తప్ప నైతిక విలువలు ఉండవు. సినిమా కూడా అంతే. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు అందులో నీతి ఉండాల ని అంటున్నారు. అది ఒక రకంగా అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఒకప్పటిలా సమాజం ఎలా ఉండాలో శాసించే స్థాయిలో ఇప్పుడు బ్రాహ్మణులు లేరు. పైగా సమాజంలోని చాలా వర్గాలకు బ్రాహ్మణులు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. పైగా ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం బలపడడం కూడా ఒక కారణం. బ్రాహ్మణవాద విలువలకు, బ్రాహ్మణీయ సంస్కృతికి వ్యతిరేకంగా కూడా చాలా సినిమాలే వచ్చాయి. స్వయంగా ఎన్టీఆరే పలు సినిమాలు బ్రాహ్మణీయ విలువలను విమర్శిస్తూ యమగోల వంటి పలు సినిమాలు తీశారు. అప్పుడు కూడా వ్యతిరేకత వచ్చినా ఆ సినిమాల్లో ఆయన భావజాల విమర్శ చేశారు తప్ప వెకిలి తనంతో బ్రాహ్మణులను అవమాన పర్చలేదు.అడ్డదిడ్డంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మోహన్‌బాబు మాత్రం ఆ పని చేస్తున్నాడు. బ్రాహ్మణుల సామాజిక బలహీనత ఆయనకు అర్థమయ్యింది.

దేశంలో సినిమా రంగానికి ఉన్న స్వేచ్ఛ మరే రంగానికీ లేదు. ఎవరైనా ఎలాంటి సినిమాలైనా తీయవచ్చు. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు. మన సెన్సార్ బోర్డు పూర్తిగా రాజకీయ నాయకుల తాబేదార్లతో, ప్రొడ్యూసర్‌ల ఏజెంట్లతో, బ్రోకర్లతో నిండిపోయింది. అందు లో విలువల గురించి ఆలోచించే వాళ్లున్నా వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. ఒక దశలో సెన్సార్ బోర్డ్ దేనికైనాడీ సినిమాను ఆలస్యం చేసింది. కానీ మోహన్‌బాబు తనదైన శైలిలో సెన్సార్ బోర్డ్ మీద విరుచుకుపడ్డారు. దీంతో సెన్సార్‌బోర్డులో ఉన్న బ్రాహ్మణ సభ్యులు కూడా కళ్ళు మూసుకుని సినిమాను చూసి నోరు మెదపకుండా విడుదల చేశారు. సినిమా కేవలం వ్యాపారమే పరమావధిగా ఉండదు. కీలకమైన విషయాల పట్ల సమాజపు ఆలోచ నా ధోరణిని మార్చే ప్రయత్నం కూడా చేస్తుంది. చాలా సినిమాల్లో ఒకానొక ముస్లిం పేరుతో విలన్ ఉంటాడు.

అత డు దుబాయిలో ఉండే డాన్ అని సినిమాలో చెప్తున్నా అంతర్లీనంగా అటువంటి ముస్లింలు మన అంతర్గత భద్రతకు ముప్పు అనే సందేశం అందులో ఉంటుంది. అటువంటి ప్రయత్నమే తెలంగాణ విషయంలో కూడా అనేక సినిమాల్లో జరిగింది. తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు అనేక పాత్రల్లో, సంభాషణల్లో, సన్నివేశాల్లో తెలంగాణవాదాన్ని,వాదుల్ని చీల్చిచెండాడే ప్రయత్నం చేసింది. ఒక్క సినిమాలే కాదు, మొత్తం మీడి యా ఇప్పుడు తెలంగాణ అనేది ఒక సమస్య అనే భావిస్తున్నాయి తప్ప అది అనేక చారివూతక సమస్యలకు, తప్పిదాలకు పరిష్కారమని చెప్పలేకపోతున్నాయి.

ఒక రకంగా బ్రాహ్మణులు ఒక కులంగా సామాజిక వర్గంగా హక్కులకోసం ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నప్పుడు వారికి మద్దతునివ్వడం ప్రజాస్వామిక లక్షణం. కానీ వారికి ఆశించినంత మద్దతు దొరకకపోవడం విచారకరం. సమాజంతో బ్రాహ్మణులు మమేకం కాకపోవ డం కూడా ఇవ్వా ళ వారిది ఒంటరి పోరాటం కావడానికి కారణం. తెలుగు సినిమాల్లో అశ్లీలత రెండు మూడు దశాబ్దాలుగా వెర్రితలలు వేస్తూనే ఉన్నది. స్త్రీని భోగ వస్తువు గా మాత్రమే చూపే సినిమాలు, వాటికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు జరిగాయి. చైతన్యవంతమైన మహిళా సంఘాలు, విద్యార్థి వర్గాలు వీటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. ఆ సందర్భంగా ఒక్క బ్రాహ్మణులే కాదు, కుల సంఘాలేవీ అందులో క్రియాశీలంగా పాల్గొన లేదు. మన సమాజానికి స్త్రీని అసభ్యంగా చూపిస్తే ఎదిరించే శక్తి లేదు. అటువంటి స్పృహ ఉంటే ‘వుమెన్ ఇన్ బ్రాహ్మనిజం’ వంటి సినిమా వచ్చేది కాదు. కేవలం బ్రాహ్మణ స్త్రీలనే కాదు, ఏ స్త్రీని కూడా అలా చూపకూడదన్న సార్వజనీన విలువ గానీ, అటువంటి ప్రయత్నాలకు మద్దతు గానీ లేకపోవడం వల్ల అటువంటి సినిమాలు వస్తున్నాయి.

అలాగే దళితులనో, మిగతా వృత్తుల వాళ్లనో కించపరుస్తూ సినిమాలు తీసినప్పుడో, వార్తలు రాసినప్పుడో బ్రాహ్మణులు కూడా వాటిని వ్యతిరేకించి ఉంటే, అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సాగిన పోరాటాల్లో బ్రాహ్మణులు కూడా భాగస్వాములై ఉంటె ఇవాళ బ్రాహ్మ ణ సంఘాల ప్రయత్నానికి మరింత బలం చేకూరేది.కేవలం సినిమాల్లోనే కాదు మొత్తం సామాజిక రాజకీయ రంగాల్లో బ్రాహ్మణులు ఒంటరివాైరై పోతున్నారు. ఇటువంటి వివాదాలు తలెత్తినప్పుడు జోక్యం చేసుకోవలసినవూపభుత్వం చోద్యం చూస్తున్నది. గతంలో అనేక సందర్భాల్లో సినిమాల పట్ల అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ సినిమాలను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఆ సినిమా చూసి అభ్యంతరాలు నిజమేనని చెప్పినప్పటికి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లేదాకా మిన్నకుండిపోయింది. ఇది బ్రాహ్మణుల రాజకీయ బలహీనతను సూచిస్తున్నది. బ్రాహ్మణ మేధావులు కూడా ఇప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడడం అంటేనే భయపడుతున్నారు. బహుశా రెండు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న సిద్ధాంత చర్చలు, కులవ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు అవి వ్యాపింప చేసిన భావజాలం కారణంకావచ్చు.

అవేవీ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఆ భావజాలానికి వ్యతిరేకం. కులం పుట్టుకకు కారణాలు ఎలావున్నా ఆ కులా న్ని పోషించడంలో, కాపాడడంలో రాజ్యంతో పాటు ఇతర కులాల పాత్రను విస్మరించలేము. బ్రాహ్మణులు ఈ సమాజంలో భాగం. పౌరులకు లభించే అన్నిహక్కులు బ్రాహ్మణులకు కూడా ఉంటాయి. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులన్నీ బ్రహ్మణులకు కూడా ఉంటాయి. ఉండాలి. అటువంటి ప్రజాస్వామిక ధోరణి అలవాటు కాకపోవడం వల్లే ఇవ్వాళ బ్రాహ్మణులు ఏకాకులుగా మిగిలిపోయారు. రేపు ఎవరినైనా ఏ కాకులు చేయగలిగే సత్తా ఈ పెట్టుబడికి, ఉన్నది. అది గమనించాలి. 
-ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

---నమస్తే తెలంగాణ నుంచి

8 comments:

  1. Thanks for bringing the article and sharing.

    #..మొత్తం సామాజిక వ్యవస్థకు వాళ్ళు దూరం కావడమే ఇవాళ్టి దురవస్థకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు..అందులో నీతి ఉండాల ని అంటున్నారు. అది ఒక రకంగా అత్యాశే అవుతుంది.

    Well said! Should react w.r.t currently prevailed conditions.

    Thought-provoking article and agree to most except few..

    #..మేధావులు..గురించి మాట్లాడడం అంటేనే భయపడుతున్నారు. బహుశా రెండు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న సిద్ధాంత చర్చలు, కులవ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు అవి వ్యాపింప చేసిన భావజాలం కారణంకావచ్చు.

    జరిగినవి మిగిలినకులాల్ని విడగొట్టే రాద్దాంత చర్చలు, స్వకుల బలుపు ఉద్యమాలు.. ఇక దాని భావజాలం నాస్తి..ఒకవేళ ఏదైనా అంటే అది హేట్రేడ్ భావజాలం మాత్రమే.

    దే.రెడి వ్యతిరేక ఆత్మగౌరవం ఉద్యమంలో పాల్గొన్నవారంతా యువకులే. తలలు పండి తలపులు ఎండి ఛాందస భావజాలంలో కొట్టుమిట్టాడే ముందుతరం వారు కాదు. కీర్తికండూతి, పిరికితనం, మితిమీరిన స్వార్ధం మరియి ఆత్మగౌరవం కన్నా అంతస్తులు/పలుకుబడులే మిన్న అనుకునే ఈ వృద్దజమ్బూకాల నుంచి యువతరం ఏమీ ఆశించడంలేదు. భవిష్యత్తు మా తరానిదే అంటూ ముందుకు సాగుతుంది వీరిని వదిలేసి.

    #తొలి తరంలో కొద్దో గొప్పో త్రిపురనేని రామస్వామి చౌదరి,..లాంటి వారి సంస్కరణవాదుల ప్రభావం ఉండడం,

    ఇది స్వకుల సంస్కరణా లేక సమాజ సంస్కరణా అనే నిజం తవ్వి తెలుసుకోవాల్సిన అవసరం/బాధ్యతా వీరివల్ల అణగద్రొక్కబడిన సామాజిక వర్గ తరాల మీద ఉంది.

    #వాళ్ళ సినిమాల్లో కొద్దో గొప్పో సం దేశం, సామాజిక ఎజెండా ఉండేది.

    ఏమా సామాజిక ఎజెండా? మాలపిల్ల అనే గోప్ప(?) సాంఘీక సిత్రంలో కథానాయకుడి పేరు "చౌదరి" అని ఉండటమేనా? లేక హేతువాదినంటూ చెప్పుకు తిరిగిన త్రి.రా మతానికి చెందిన కులం తోక తగిలించుకు తిరగడమా?

    #..మధ్యలో కొంత కమ్యూనిస్టు భావాలున్న వాళ్ళు, ప్రజానాట్యమండలిలో ..

    తమ కుల బలుపు కోసం మరియు ఒక సామాజికవర్గానికి వ్యతిరేకంగా రాజకీయాల్లో రావడానికి కమ్యూనిజాన్ని పావుగా వాడుకున్నారనే నిజాన్ని పైవిధంగా రాయడం బాధాకరం.

    ReplyDelete
  2. రాజేష్ చాలా బాగా చెప్పారు. చాలా కరెక్ట్ గా చెప్పారు.

    ReplyDelete
  3. నిజాయితీగా, ఆలోచన రేకెత్తించే వ్యాసం వ్రాసినందుకు అభినందనలు.
    బ్రహ్మద్వేషం క్రొత్త విషయం కాదు.
    అలాగని బ్రహ్మద్వేషం అనేది మంచి ఫలీతాలేమీ యిచ్చిన దాఖలాలూ లేవు.
    వ్యాపారంలో లాభానష్టాలే ఉంటాయి తప్ప నైతిక విలువలు ఉండవు. నిజమే.
    సినిమా కేవలం వ్యాపారం మాత్రమే కాబట్టినైతిక విలువలు లేకపోయినా పోగొట్టుకున్నా దాని దుష్ఫలితాలు సమాజం అంతా భరించక తప్పదని మనం తెలుసుకోవాలి.

    ReplyDelete
  4. పోతే పైన రచయిత చెప్పనిది ఇంకొకటి ఉంది. ఈ సంఘటనతో వారి అహంభావాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. అందులో మొహన్ బాబు పక్షాన నిలబడటానికి ఒక చిన్న పాయింట్ కూడా లేదు. అటువంటిది మొహన్ బాబు ను వెనుకేసుకొస్తూ ఆ వర్గ సినేమా పెద్దలు మాట్లాడటమనేది అన్నిటికన్నా ఘొరం. అంతమంది మొహన్ బాబు కి ఏ కారణం చూసి మద్దతు ఇచ్చారో? వారికే తెలియాలి. అనవసరమైన ఇటువంటి గొడవలో మొహన్ బాబు పక్షాన నిలబడి,వారు ఇమేజ్ ని పోగొట్టుకొన్నారు. ఈ సంఘటన ద్వారా వారిలో న్యాయం, ధర్మం కన్నా ఎక్కువ దేనివైపు మొగ్గుచూపుతారో అనేది అందరికి స్పష్ట్టమైన సందేశం పంపారు. అందువలననే కాబోలు ఈ సంఘటనవలన బ్రాహ్మణులతో పాటుగా ఇతర అబ్రాహ్మణ వర్గాలవారు కూడా వీరిని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణులకు మద్దతు తెలిపారు. ఇక ఎంత మంది బ్రహ్మణులు రోడ్ల పైన వచ్చి నిరసన తెలిపారో అనేవిషయం పక్కన పెడితే. ఈకాలంలో నెట్, టి వి ల ప్రభావం తీసిపారేయ తగ్గ విషయం కాదు. ఈ రెండిటిలో బ్రాహ్మణులకు మద్దతు లభించింది. ఇది శుభారంభం. వాళ్లలో చాలా దశాబ్దాల తరువాత చలనం మొదలైంది.

    ReplyDelete
  5. ఘంటా చక్రపాణి ఒక తెలంగాణా వ్యతిరేకి అయిన మోహన్ బాబు ని విమర్సిస్తున్నట్టుగా, బ్రాహ్మణుల మీద ప్రేమ పుట్టుకోచ్చినట్టుగా జాలి చూపుతూ మొసలి కన్నీళ్లు బాగానే కార్చేరు. కానీ ఆయన ఒక విషయాన్ని గమనించలేదు. కారణం ఆయన రాస్తున్నది ఒక తెలంగాణా ఉద్యమాన్ని నడుపుతున్నాను అనే భ్రమలో ఉన్న నాయకుడి పత్రికలో. మోహన్ బాబు చేసిన రాద్ధాంతం వలన ఒక కులానికి లేదా ఒక సామాజిక వర్గానికి అతడు అతడి కుటుంబం పూర్తిగా దూరం అయ్యాయి. ఈ రోజు తన సినిమా ఏదో కాస్త నాలుగు రూపాయలు సంపాదించి ఉండవచ్చు గాక. దానిని బిజినెస్ మేనేజ్మెంట్ లో విండ్ ఫాల్ బిజినెస్ అంటారు. అంటే ఒక్కసారే అది అమ్ముడు పోతుంది. అలాగే మోహన్ బాబు సినిమా ఇది అమ్ముడుపోయిందని, మిగలిన సినిమాలు అమ్ముడు పోవు. అలాగే ఆయనతో కలిసి సినిమా తీయడాని ఎవరూ సిద్ధపడరు. కారణం ఒక పెచీకోరు తో ఎవరూ తల గోక్కోరు. మంచో చెడో కానీ ఈ దెబ్బతో బ్రాహ్మణులు అంతా ఐకమత్యంతో ఉన్నారు. ఎక్కడో సిద్ధాంత వాదులు తప్ప. అక్కడికీ వాళ్ళలో ఉన్న ఐకమత్యాన్ని విడగోట్టాలనే ప్రయత్నం సదరు నటుడు గారు చేసారు పక్క రాష్ట్రం నుండి అరవ బ్రాహ్మణులని తీసుకొని వచ్చి. వాళ్లు తెలుగు మాట్లాడుతూ ఉండొచ్చుగాక. కానీ వాళ్లని తెలుగు వాళ్లు గా గుర్తించరు. పైగా ఆయన తీసుకోచ్చినది ఎవరిని? తన ఇంటికి వచ్చి తాను చెప్పినట్టుగా తల ఊచి, అవసరమైతే కాళ్లు పట్టే సినిమాల్లో పూజలు చేసే అరవ బ్రాహ్మల్ని(మళ్లీ హైదరాబాద్ లో స్టుడియో లలో పూజలు చేసే బ్రాహ్మలు రాలేదు). వాళ్లు ఎన్ని పూజలు చేసినా వాళ్లకి సరియైన గౌరవం సమాహం లో ఇవ్వరనే విషయాన్ని మోహన్ బాబు తో పాటుగా మన ఘంటా వారు గమనిస్తే మంచిది. ఈ విధంగా తాను కూర్చొన్న కొమ్మని నరుక్కోన్నాడు మోహన్బాబు. ఇక్కడే ఇంకొక విషయం బ్రాహ్మణులు ఆంధ్రా, తెలంగాణా లేదా రాయలసీమ అనే ప్రాంతాల భావనకి అతీతం గా ఒక్కటైనా విషయం గుర్తిన్చునట్టున్నారు. మన ఘంటా వారు. అందుకే మొత్తం సమాజానికి ఏదో సహాయం చేసే వారిలాగా రాసారు ఈ వ్యాసాన్ని. ఈ వ్యాసం లో కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల ప్రజలమీద ఉన్న కోపాన్ని వెళ్ళగక్కారు. అక్కడ అంతా కమ్మ వారే ఉంటారు వేరే కులాల వారు ఉండరు అనే భావనని రేకేట్టిస్తుండి. అలాగే బ్రాహ్మణులు ఇంతకుముందు బహుజనుల మీద దాడులు జరిగినప్పుడు దాడి చేసిన వారిని విమర్శించి ఉంటే అలాగే బహుజనులని సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు అని వాక్రుచ్చారు. అయ్యా ఘంటావారు, బ్రాహ్మణులు బహుజనుల మీద దాడి జరిగినప్పుడు దాడి చేసిన వారిని సపోర్ట్ చేసారని మీకు ఎవరు చెప్పారు? ఆ దాడులని ఖండించడం ఎప్పుడూ జరిగింది.

    ReplyDelete
    Replies
    1. రాళ్ళభండి వారూ,

      అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడానికి ప్రాంతీయ తేడాలు అవసరం లేదు, మానవత్వం ఉంటే చాలు. మనిషి ముసుగులో దాగుండే మృగాలు మాత్రమే జీవితమంతా ప్రజలకొరకు అర్పించిన మానవమూర్తులపై కూడా తెలంగాణవాదులనే అక్కసుతో "ఇద్దరు చచ్చినాళ్ళ కథ" అంటూ విషం చిమ్మగలరు.

      మోహన్‌బాబుకు బ్రాహ్మణులపై విషం చిమ్మడం మొదటిసారికాదు, విండ్‌ఫాల్ ప్రాఫిట్సు ఇప్పుడొక్కసారి వచ్చి తరువాత ఆగిపోవడానికి. మోహన్‌బాబు తన సామాజిక వర్గానికి దూరం కాలేదు, పైగా దగ్గరయ్యాడు. ఇందుకు తార్కాణం ఈసినిమాపై పచ్చపత్రికల పక్షపాత కవరేజీ.

      ప్రాంతాలకతీతంగా బ్రాహ్మణులు ఈవిషయంపై ఏకమైతే మీకొచ్చే నష్టమేమిటో? ప్రాంతాలు వేరయినా, రేపు రాష్ట్రాలు విడిపోయినా బలహీనవర్గాలపై దాడులు జరిగినప్పుడు తెలంగాణ నాయకత్వం, మేధావి వర్గం స్పందిస్తుంది. మొన్నటి లక్షింపేట దాడులతరువాత దళితులకు అండగా తెలంగాణ మేధావి వర్గం, నాయకత్వం, నమస్తే తెలంగాణ పత్రిక, మరి ఏ పచ్చపత్రిక దళితులకు అండగా నిలిచింది? ఏ కమ్మ, కాపు నేతలు దాడులను వ్యతిరేకించారు?

      Delete
  6. @ ఈ సంఘటనతో వారి అహంభావాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. అందులో మొహన్ బాబు పక్షాన నిలబడటానికి ఒక చిన్న పాయింట్ కూడా లేదు. అటువంటిది మొహన్ బాబు ను వెనుకేసుకొస్తూ ఆ వర్గ సినేమా పెద్దలు మాట్లాడటమనేది అన్నిటికన్నా ఘొరం. అంతమంది మొహన్ బాబు కి ఏ కారణం చూసి మద్దతు ఇచ్చారో? వారికే తెలియాలి. అనవసరమైన ఇటువంటి గొడవలో మొహన్ బాబు పక్షాన నిలబడి,వారు ఇమేజ్ ని పోగొట్టుకొన్నారు. ఈ సంఘటన ద్వారా వారిలో న్యాయం, ధర్మం కన్నా ఎక్కువ దేనివైపు మొగ్గుచూపుతారో అనేది అందరికి స్పష్ట్టమైన సందేశం పంపారు.

    వినాశకాలే విపరీత బుద్ది...పోయే కాలం దాపురించినపుడు...ఆ బ్రహ్మ కూడా నిలువరించలేడంటారు...
    ద్వేషంతో చేస్తున్న వ్యాఖ్య లు కావివి...అసహ్యం తో వేసి చెప్తున్నవి..

    ReplyDelete