Friday 22 July 2011

ఆదిరెడ్డి నేడు, యాదయ్య ఆనాడు


ఆవె!!
ఆదిరెడ్డి నేడు, యాదయ్య ఆనాడు
అసువుబాసి ఎందరమరులాయె?
పక్షపాత బుద్ది ప్రభుతయూ, మీడియా
ఒక్కరీతి కూడి వెక్కిరించె!!  


ఆవె!!
ఆరు నూర్ల యువకులాత్మార్పణము జేయ
జాళి జూప నెవరి జాడలేదె?
విగ్రహాలపైన విపరీత ప్రేమలా?
మట్టి బొమ్మ విలువ మనిషి కేది?

Monday 11 July 2011

రాయలసీమ, కోస్తాంధ్ర కలిసి ఉంటాయా?

ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఒక నిర్ణయాత్మక దశకు వచ్చింది. తెలంగాణకు చెందిన పార్లమెంటు, శాసనసభ ప్రతినిధులందరూ రాజీనామా చేసిన తరువాత కేంద్రానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఇక సమస్యను నాంచుడు కార్యక్రమం ఎక్క్వకాలం చెయ్యలేరు. ముందు టపాల్లో చెప్పుకున్నట్లు మరో మూడేల్లు ఆగితే ఎన్‌డీయే ఎలాగూ తెలంగాణ ఇస్తుంది కనుక ఈలోపట తెలంగాణ ఇస్తే కాంగ్రేస్‌కే మంచిది.

అయితే విభజనకు ముందు రాష్టృఆన్ని ఏరకంగా విభజించాలనే విషయంలో స్పష్టత అవసరం. దీనికి విభజన తరువాత రాయలసీమ, కోస్తాంధ్ర కలిసి సమైక్యంగా ఉండగలవా అనేది చాలా ముఖ్య్మైన అంశం. తెలంగాణ ప్రజలు విడిపోతామంటే తమతమ స్వార్ధ ప్రయోజనాలకోసం, ఇప్పటివరకూ తెలంగాణతో కలిసి ఉండడం వలన మితిమీరిన లబ్దిపొందుతూ అదెక్కడ పోతుందో అనే అసహనంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు కలిసి సమైక్య ఉద్యమం చేపట్టారు కానీ వీరికి తెలంగాణ ప్రజలమీద ఎలా ప్రేమలేదో, వీరిలో వీరికి కూడా అలాగే ఎలాంటి ప్రేమలు లేవనేది అందరికీ తెలిసిన వాస్తవమే.

మద్రాసు రాష్ట్రంతో కలిసిఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కొరకు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే రాయలసీమకు చెందిన నాయకులకు కోస్తాంధ్ర వారిపై ఉన్న అనుమానాలతో వారు ఒక్క రాష్ట్రంగా ఉండడానికి ఒప్పుకోకపోవడంతో ఆడిమాండ్ వెనుకబడిపోయింది. చివరికి శ్రీబాగ్ ఒప్పందం కుదిరి రాయలసీమకు కొన్ని ప్రతిపత్తులు ఇస్తామని ఒప్పుకున్న తరువాత మాత్రమే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర డిమాండ్ ముందుకు వెల్లింది. ఆశ్రీబాగ్ ఒప్పందం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయ్యింది.

అయితే శ్రీబాగ్ ఒప్పందం సరిగా అమలు కాలేదని రాయలసీమ నాయకులకు అసంతృప్తి ఇప్పటికీ ఉంది. అలాగే శ్రీబాగ్ ఒప్పందంతో మేము నష్టపొయ్యామని కొందరు అప్పటికే ధనబలం కలిగిన మధ్యకోస్తా భూస్వామ్య వర్గానికీ ఉంది. మొత్తానికి తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత ఈరెండుప్రాంతాలవారికీ మరో సాఫ్ట్ టార్గెట్ దొరకడం వలన రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు రెండూ తెలంగాణను ఎక్స్‌ప్లాయిట్ చేసి లాభం పొందాయి కనుక ఈభేదలు ఇంతకుముందు బయటపడలేదు.

అయితే తెలంగాణ విడిపోతే రాయలసీమ, కోస్తాంధ్ర ఎంత్వరకు కలిసి ఉండగలవనేది సందేహమే. ఇప్పుడు క్రిష్ణా జలాల్లో తెలంగాణ వాటా పూర్తిగా నొక్కేయడం వలన రాయల్సీమకు నీరివ్వగలుగుతున్నారు. అయితే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడ్డతరువాత ఒక రాష్ట్రంగా తెలంగాణకు రావాల్సిన నదీజలాల వాటాను ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది. అప్పుడు తెలంగాణ వాటా పోయిన తరువాత రాయలసీమకు నీరివ్వాలంటే నీటిదాహం విపరీతంగా గల మధ్యకోస్తా నాయకులు ఒప్పుకోరు, స్వతహాగా అంతా తమకే చెందాలనుకుంటారు.

రాయలసీమ తెలంగాణలాగా సాఫ్ట్ టార్గెట్ కాదు. రాజకీయబలం బాగా ఉండి, ముఠాకక్షలకు పేరుగాంచినా ఇక్కడి నాయకులు మధ్యకోస్తా పెత్తనాన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు. నిజానికి ఇప్పుడు సమిక్యాంధ్రప్రదేశ్ లోనే ఎప్పుడూ అతితక్కువ జనాభా కల రాయలసీమ నుండే ముఖ్యమంత్రులు ఉంటున్నారంటే సీమాంధ్ర రాష్ట్రంలో కూడా వీరే ముఖ్యమంత్రులు అవుతారు. మరి సీమాంధ్ర రాజకీయబలాన్ని కోస్తాంధ్ర ధనబలం గౌరవిస్తుందా? ఈప్రశ్నలన్నింటికీ సమాధానాలకోసం వేచిచూడాల్సిందే.

ఇప్పుడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి కలిసి ఉన్నట్లు నటించే ఈరెండుప్రాంతాలు, కేంద్రం విభజనకు ఒప్పుకున్న మరుక్షణం కత్తులు దూసుకోవడం ఖాయం. ఏతావాతా తెలిసేదేమంటే తెలుగుజాతి ఐక్యత, సమైక్య నినాదం అంతా నేతిబీరకాయలో నెయ్యే.

Sunday 10 July 2011

భాద్యత కేంద్రానిదే..కానీ వ్యతిరేకించడం మా హక్కు


చివరికి అంతా అనుకున్నదే అయ్యింది. జగన్ తెలంగాణ విషయంపై చేతులెత్తేశాడు. తెలంగాణ ఇచ్చే లేదా ఆపే హక్కు నాకు లేదు, తేల్చాల్సింది కేంద్రమే అంటూ తానూ గోడమీద పిల్లినే అని చెప్పకనే చెప్పాడు. ఇదేమాట ఇన్ని రోజులూ రెండు కల్లూ సొట్టబోయిన చంద్రబాబూ చెబుతున్నాడు కనుక జగన్ కొత్తగా చెప్పిందేం లేదు.

తేల్చాల్సింది కేంద్రమేనంటూ భాద్యత కేంద్రంపై నెట్టివేసే ఈనేతలు కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిర్ణయానికి కట్టుబడడం అటుంచి తామే అంతకు కొన్ని గంటలముందు ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉన్నారా అంటే లేదు.. ఇదే చంద్రబాబు స్వయంగా సీమాంధ్రలో తమ పార్టీనాయకులచేత కృత్రిమ ఉద్యమం సృష్టించడమే కాకుండా అందుకు కావల్సిన మెటీరియల్ మొత్తాన్ని తానే ఎంటీఆర్ భవన్ నుండి సమకూర్చాడు. మరోసారి కేంద్రం తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంటే రేపు చంద్రబాబు లాగే జగన్ కూడా అదే పని చేస్తాడు.ప్రస్తుతానికి ఇద్దరూ తెలంగాణలో తమ పార్టీ ప్రతినిధులచేత తామే రాజీనామాలు చేయించి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు అని ప్రజలను భ్రమింపజేద్దామని ప్రయత్నం చేస్తున్నారు.

అంటే ఈరాజకీయ పార్టీలకు తెలంగాణపై నిర్ణయంలో భాగం పంచుకునే భాద్యత లేదు, కానీ కేంద్రం ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు మాత్రం ఉందన్నమాట. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు ఇప్పటిదాకా చంద్రబాబు దగ్గర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను విశ్వసనీయతకు మారుపేరు అని చెప్పుకునే జగన్ కూడా చేస్తూ తానూ ఆతానుముక్కనే అని నిరూపించుకున్నాడు. విశ్వసనీయత అంటే ఆచరణ సాధ్యం కాని ఉచిత పధకాలను గుప్పించి ఖజానాను గుల్లచేసి తన సొంత ఖజానా నింపుకోవడం కాబోలు.

ఇంతకూ చంద్రబాబుకూ జగన్‌కూ ఉన్న తేడా ఏమిటి? ఒకడు వేలకోట్ల అవినీతి చేస్తే మరొకడు లక్షల కోట్లకు అవినీతిని పెంచాడు. కాలం గడుస్తున్నకొద్దీ మన రాష్ట్ర బడ్జెట్ పెరిగినట్లే అవినీతి స్థాయి పెరగడంలో ఆశ్చర్యం లేదు. రేపు చంద్రబాబుకు అధికరం ఇస్తే అతను లక్షలకోట్ల అవినీతిని కోటికోట్లకు పెంచగల సమర్ధుడు. ఒకడు మామకు వెన్నుపోటు పొడిస్తే మరొకడు తండ్రి పదవి అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు మేసి ఆస్తితోపాటు అధికారానికీ వారసున్ని నేనేనంటున్నాడు. ఇద్దరూ చేసేది కులరాజకీయాలు, ధన రాజకీయాలే..కానీ తాము రెప్రజెంట్ చేసే కులాల్లో తేడా, అందుకే వారి వారి సమర్ధకులు కూడా మారుతారు, రాష్ట్ర విభజన విషయం వచ్చేవరకూ అందరూ సీమాంధ్ర వాదాన్నే సమర్ధిస్తారు. ఈమాత్రం దానికి కొందరు మాబాబు గొప్ప అంటే కొందరు మా జగన్ గొప్ప అంటూ కేవలం తాము ఏసామాజిక వర్గానికి చెందినవారో చెప్పకనే చెబుతున్నారు.

Thursday 7 July 2011

కేంద్రం ఇప్పుడు ఏంచెయ్యాలి?

రాష్ట్రవిభజన ప్రస్తుత పరిస్థుతుల్లో కాంగ్రేస్‌కు అనివార్యమని క్రితం పోస్టులో చెప్పుకున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితిని పరిష్కరించి భవిష్యత్లో తమిలనాడులో లాగా కాంగ్రేస్ పూర్తిగా మనుగడ కోల్పోకుండా ఉండాలంటే రాష్ట్రాన్ని ఇప్పుడు విభజించాల్సిందే. అయితే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తే ఎక్కువమందిని ఒప్పించి లాజికల్‌గా విభజించి కాంగ్రేస్‌కూడా లబ్ది పొందవచ్చు?

తెలంగాణ మాత్రం విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే పూర్తిగా 1956 క్రితం పరిస్థితిలోకి, ఫజల్ అలి శిఫార్సుల్లో మొదటి సిఫార్సుకి వెల్లినట్టు అవుతుంది. అయితే ఇలా చేస్తే తెరాసకు పూర్తిగా తల వంచినట్లవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రేస్ తెరాసపై ఆధారపడాల్సి వస్తుంది. అలాగే కొందరు కావూరు లాంటి నేతలు రాష్ట్ర విభజనకు ఒక ప్రాతిపాదిక ఉండాలి, తెరాస చెప్పినట్లు జరగదు అంటున్నారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని మేము కాస్త శాస్త్రీయంగా విభజన చేశాం అని కాంగ్రేస్ చెప్పుకోవచ్చు కూడా. అయితే రాష్ట్రాన్ని ఎలా ఎన్ని ముక్కలు చెయ్యొచ్చు?

1) మూడు ప్రాంతాలను మూడు రాష్ట్రాలు చెయ్యడం ఒక వాదన. అయితే రాయలసీమకు ఒక రాష్ట్రంగా మనగలిగే అంత వనరులు లెవ్వు కనుక ఇది సాధ్యం కాదు.
2) గ్రేటర్ హైదరాబాద్‌ను ఒక రాష్ట్రంగా మార్చాలనేది ఒక వాదన...గ్రేటర్ హైదరాబాద్ తాగునీటివిషయంలో మిగతా ప్రాంతాలపై ఆధారపడాల్సి ఉంటుంది కనుక ఇది కూడా సాధ్యం కాదు. పైగా హైదరాబాద్‌ను చేస్తే మిగతా అన్ని మహానగరాలనూ రాష్ట్రాలుగా మార్చాలని డిమాండ్ రావొచ్చు..ఇది ప్రాక్టికల్ కాదు.
3)మహబూబ్ నగర్ను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చెయ్యటం...ఇప్పటిఏ సమైక్య రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడి నీల్లున్నప్పటికీ తమకు దొరకని పరిస్థితిలో ఉన్న మహబూబ్‌నగర్ వాసులు దీన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు.
4) రాయల తెలంగాణ...ఇది ఇద్దరికీ ఇస్టం ఉండని మరో బలవంతపు పెల్లి జరపడమే. పైగా అంతపెద్ద రాష్ట్రానికి తీరప్రాంతం అస్సలు ఉండదు.
5. పైవన్నీ కాకుండా ఉత్తరాంధ్రను తెలంగాణలో కలిపి రాష్ట్రాన్ని ఉత్తర దక్షిన భాగాలుగా ఈమ్యాపులో చూపినట్లు విభజిస్తే చాలా సమస్యలు తీరుతాయి. ప్రస్తుతం ఎలక్షన్లు జరిగేటప్పుడు ఈవిధంగానే మొదటి, రెండో ఫేజుల్లో జరుగుతయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ పై ప్రాంతపు ఎన్నికలు కాగానే మాటమార్చి హైదరాబాద్ వెల్లాలంటే వీసాలు తీసుకోవాలా అన్న విషయం తెలిసిందే.


ఉదాహరణకు:
1) రెండు రాష్ట్రాలకూ సముద్ర తీరం దొరుకుతుంది.
2) ఉత్తరాంధ్ర కూడా తెలంగాణాలాగే వివక్షకు గురవుతున్న ప్రాంతం.. విడిపోతే మధ్యకోస్తా వారు తమకు అన్యాయం చేస్తారని వీరికి భయం ఉంది.
3) ఉత్తరాంధ్ర, తెలాంగాణ ప్రాంతాల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్లో పోలిక ఉంటుంది. రెండూ వెనుకబడిన ప్రాంతాలు, రెండు చోట్లా దళిత, బీసీ వర్గాలు ఎక్కువ.
4) తెలంగాణలో ఉత్తరాంధ్ర కూడా ఉండడం వలన పూర్తి తెరాస ఆధిపత్యం కాకుండా కాంగ్రేస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చెయ్యొచ్చు.
5) ఉత్తరాంధ్రలో బలం పెంచుకుంటున్న జగన్‌కు చెక్ చెప్పినట్లవుతుంది.

ఏం చేస్తే ఏం జరుగుతుంది?



తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించినతరువాత ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం సంక్లిష్ట స్థ్తితిలోకి వచ్చింది. అసలే బొటాబొటి మెజారిటీతో ఉండి అందులోనూ అవినీతి కూపంలో కూరుకుపోయి మంత్రులపైనే విచారణలెదుర్కుంటూ, మరో పక్క లోక్‌పాల్ విషయంతో కొట్టుమిట్టాడుతున్న కేంద్రానికి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అని భయంతో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని ఇలాగే కొనసాగించడం అసలు సాధ్యం కాదు కనుక కేంద్ర ఏం చెయ్యాలి? ఇప్పుడు కేంద్ర దగ్గర ఉన్న మార్గాలు ఏమిటి? ఇంతకూ కేంద్రం ఏం చేస్తే ఏం జరుగుతుంది?

రెండు మూడు రోజుల్లో జగన్ తన స్టాండును కూడా చెప్పాల్సి వస్తుంది. జగన్ నిర్ణయం కూడా కొంతవరకూ భవిష్యత్ పరిణామాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం కొండా సురేఖ, జయసుధల రాజీనామాలను బట్టి జగన్ తెలంగాణ సమర్ధిస్తాడనుకోవచ్చు. కాకపోతే జగన్ మద్దతు ఇవ్వడం, ఇవ్వకపోవడం వల్ల ఈక్వేషన్లు పెద్దగా మారకపోవచ్చు.

1) గవర్నర్ పాలన: కేంద్ర ఎటూ తేల్చక, అందరి రాజీనామాలు తీసుకుని రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించవచ్చు. ఇదే నియంత గవర్నర్ నరసింహన్‌ను కొనసాగించి రాబోయే మూడేల్లలో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివెయ్యొచ్చు. తరువాత నిదానంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2014లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరుపవచ్చు.

ఫలితం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రేస్, తెలుగుదేశం పూర్తిగా ఓడిపోతాయి. టీఆరెస్, బీజేపీ, సీపీఐ ఒక కూటమి లాగా మారవచ్చు. జగన్ అనుకూల నిర్ణయం తీసుకుంటే జగన్ కూడా కూటమిలో చేరవచ్చు. టీఆరెస్, బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. సీట్ల పంపిణీ ద్వారా సీపీఎం, జగన్ పార్టీలు తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. మజ్లీస్‌కు బాగా సీట్లు తగ్గిపోయి ఒకటి లేదా రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవచ్చు. పార్లమెంటు సీట్లలో కాంగ్రేస్్‌కు బహుషా ఒక్కటి కూడా దక్కక పోవచ్చు.

గవర్నర్ పాలన వలన సీమాంధ్ర ప్రజలు కూడా విసిగిపొయి ఉంటారు కాబట్టి కాంగ్రేస్‌కు సీమాంధ్రలో కూడా 4-5 కంటే ఎక్కువపార్లమెంటు స్థానాలకంటే ఎక్కువ రావు. జగన్‌కు ఎక్కువ సీట్లు , కొన్ని సీట్లు టీడీపీకి దక్కొచ్చు. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్కుండి 4,5 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటే కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఎండీయే అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణ ఇస్తుంది. అప్పుడు రాష్ట్రంలో కూడా జగన్, టీఆరెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఉంటే వారు విభజనకు అభ్యంతరాలు పెట్టరు. తెలంగాణలో టీఆరెస్, ఆంధ్రాలో జగన్ పార్టీ అధికారంలోకి రావొచ్చు.


2) సమస్యను సాగదీయడం: ఏదో ఒకలాగా కాంగ్రేస్ ప్రజాప్రతినిధులను మెత్తబరిచి, సమస్యను పరిష్కరిస్తున్నట్లు నటించి రాజీనామాలు వెనక్కి తీసుకునేట్టు చేసి కాలయాపన చెయ్యడం. రెండు సంవత్సరాలు అలాగే గడపెయ్యడం.

అప్పుడు కూడా వెచ్చే ఎలక్షన్లలో కాంగ్రేస్ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. తెలుగుదేశానికి ఇప్పటికే అడ్రస్ లేదు. ఎలక్షన్ రిజల్ట్సు మొదటి ఆప్షన్ లాగానే ఉంటాయి. తరువాత జరిగే పరిణామాలు కూడా భిన్నంగా ఉండవు, ఎండీయే అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇస్తుంది.

3) తెలంగాణ ఇవ్వడం:  కేంద్రానికి మిగిలిన ఏకైక మార్గం తెలంగాణ ఇచ్చెయ్యడం. అప్పుడు ఉద్యమం సీమాంధ్రాకు మారుతుంది. కొన్నిరోజులు బంద్‌లూ గట్రా జరుగుతాయి. తెలంగాణా నుండి స్పషల్ ఫోర్సులను ఆంధ్రాకు తరలిస్తే రెండువారాల్లో అక్కడ పరిస్థితి మామూలు దశకు తీసుకురావొచ్చు.

ఎలాగూ అక్కడ ప్రజల్లో విభజన విషయంలోగానీ సమైక్యత విషయంలో గానీ పెద్ద ఆసక్తి లేదు. ఉద్యమాన్ని నడిపించేది ఎలాగూ నాయకులే. కాంగ్రేస్ నాయకులు సోనియా ఒక్కసారి కన్నెర్రజేస్తే నోరుమూసుకుంటారు. జగన్ బూచిని చూపి చంద్రబాబును దారిలోకి తెచ్చుకుంటే తెలుగుదేశం నాయకులు కూడా మెత్తబడుతారు. జగన్ ఎలాగూ రెండు రోజుల్లో తెలంగాణ అనుకూల ప్రకతన చేస్తాడనుకుంటే జగన్ సమైక్య ఉద్యమం చేసే అవకాశాలు అస్సలు లెవ్వు.

వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రేస్ తెరాసతో పొత్తు పెట్టుకోవచ్చు, లేక తెరాసను కలిపేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో కొన్ని సీట్లు కాంగ్రేస్ గెలుచుకోవచ్చు. సీమాంధ్రాలో విభజన వద్దనే పార్టీ ఏదీ ఉండదు కాబట్టి సీమాంధ్రాలో ఈఅంశం ఎన్నికలపై ప్రభావం చూపకపోవచ్చు. చంద్రబాబు పని ఇప్పటికే అయిపోయింది కాబట్టి సీమాంధ్రలో జగన్, కాంగ్రేస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. దీనివల్ల వచ్చే ఎలక్షన్లలో కేంద్రంలో కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి రాకపోయినా కనీసం కొన్ని సీట్లు పెరుగుతాయి, ఆంధ్ర, తెలంగాణాల్లో తన ఉనికిని కాంగ్రేస్ కాపాడుకుంటుంది.

కాబట్టి ఎలా చూసినా తెలంగాణా ఇస్తేనే కాంగ్రేస్‌కు లాభం. ఏం జరిగినా వచ్చే మూడేల్లలో పూర్తిగా జోకర్లుగా మిగిలేది మాత్రం చంద్రబాబు, చిరంజీవి
.

Sunday 3 July 2011

హైదరాబాదులో రాజకీయ మతకల్లోహాలు ఏనాటివి?

మనదేశంలో మతకల్లోహాలు కొత్తగాదు, హిందువులూ, ముస్లిముల ఘర్షణలు కొత్త గాదు. అసలు మనదేశంలో అనేముంది ప్రపంచంలో అనేక చోట్ల మతయుద్ధాలు, ఘర్షనలు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఈమధ్య తగ్గాయి కానీ చరిత్రలో అక్కడ కూడా మతఘర్షణలు జరిగిన ఉదంతాలు అనేకం. మనదేశంలో ముస్లిములు అధికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో మతఘర్షణలు అనేక సందర్భాల్లో జరిగాయి. మతం ఉన్నన్నాల్లూ మతఘర్షనలు ఏదో ఒకరీతిలో ఉంటాయనేది మత ఛాందసవాదులు తప్ప మిగతావారంతా ఒప్పుకునేదే. అందుకే ఈమతాల అడ్డుగోడలు తొలగిపోవాలని అభ్యుదయవాదులందరూ చెబుతారు.

మిగతా ప్రాంతాల్తో పోల్చినపుడు హైదరాబాదులో మతసామరస్యం బాగానే ఉండేది అనేది అందరూ ఒప్పుకునే విషయం. ఇంతమంది ముస్లిములు ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ హిందువులూ, ముస్లిములూ by and large కలిసే ఉన్నారు. కలిసి ఒకరి పండుగలు మరొకరు చేసుకున్నారు, ఒకరి పెల్లిల్లకు, ఫంక్షన్లకూ మరొకరు అతిథులయ్యారు. ఏదో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా పెద్దేత్తున ఇక్కడ ఘర్షణలు జరిగిన ఉదంతాలు చరిత్రలో కనపడవు.ఇప్పటికీ పాతబస్తీలో హిందువులూ, ముస్లిములూ చక్కగా కలిసే ఉంటారు.

అయితే ఎప్పుడయితే రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాలకు హైదరాబాద్ పాతబస్తీని వాడుకోవడం మొదలు పెట్టారో అప్పటినుంచీ ఇక్కడ పెద్ద ఎత్తున ఘర్షనలు చెలరేగాయి. వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అయితే ఇవి నిజమయిన మత ఘర్షనలు కావు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలకు మతవిభేదాలను రెచ్చగొట్తడం ఒక ఎత్తు. అది దేశంలోని మిగతా ప్రాంతాల్లో మొదలయ్యింది. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. రాజకీయ పార్టీలు తమ అనుచర బృందాన్ని ఇతర ప్రాంతాలనుండి తెప్పించి హత్యలు చేసి వాటికి మతం రంగు పుయ్యటం మాత్రం హైదరాబాదుకే ప్రత్యేకమయింది. ఇవి ఎంత ఘోరంగా జరిగాయి అంటే ఒకే బస్టాపులో హిందూ, ముస్లిం లిద్దరూ ఉంటే స్కూటర్ మీద వచ్చిన దుండగులు హిందూ, ముస్లిం లిద్దరిపై దాడి చేసినలాంటి ఉదంతాలెన్నో.

ముఖ్యమత్రులను మార్చాలన్నా, కొందరు నేతలకు తమ ప్రాబల్యం పెంచుకోవాలన్నా హైదరాబాదులో మతఘర్షణలను కృత్రిమంగా సృష్టించడం గత మూడుదశాబ్దాలుగా మొదలయిన నాయాట్రెండు. కృత్రిమంగా ఉద్యమాలే సృష్టించిన ఘనులకు కృత్రిమ మతఘర్షణలు సృష్టించడం పెద్ద విద్యేం కాదు. ఈ ట్రెండును సృషించింది, రాజకీయ అవసరాలకోసం హైదరాబాదుకు బయటినుండి తెప్పించిన గూండాలద్వారా మతకల్లోహాలు సృష్తించిందీ ఎవరనేది ఇక్కడ అందరికీ తెలిసినా బయటికి చెప్పలేని ఒక బహిరంగ రహస్యం. ఇది ఎవరి రంగప్రవేశం తరువాత మొదలయిందో కూడా తెలిసిందే. మజ్లీస్ లాంటి ఒక ముఠాకు అనవసర సీనిచ్చి దాన్ని బలంగా తయారుచేసింది కూడా ఈవర్గమే.

సాధారణంగా ఒక వ్యాసం రాసేప్పుడు విషయాన్ని వివరించగలిగే సౌలభ్యం ఉన్నట్టు టీవీ చానెల్స్‌లో అందునా సీమాంధ్రా మీడియా చానెల్లుగా ముద్రపడ్డ కొన్ని చానెల్లు ఒకరిపై ఒకరు అరుచుకోవడమే చర్చ అని చెప్పబడే చర్చాకార్యక్రమాల్లో ఉండదు. అలాంటి ఒక అరుపుల కార్యక్రమంలో ఒక తెలంగాణ అనుకూల మీడియా విశ్లేషకుడు హైదరాబాదులో మతఘర్షణలు మొదలయింది సీమాంధ్ర నేతల ప్రవేశం తరువాతే అని చెప్పాట్ట, నేనయితే అది చూళ్ళేదు. ఆచత్త కార్యక్రమాన్ని పట్టుకుని ఆ విశ్లేషకుడు చవకబారున్నర విశ్లేషకుడు, సిగ్గులేని ప్రొఫెసరు అంటూ రకరకాల పోస్టులు బ్లాగుల్లో వెలిశాయి, అక్కడికి ఈయన తప్ప మిగతా విశ్లేషకులందరూ పెద్ద సుద్దపూసలు, ఈయన తప్ప మిగతా వారు చెప్పేవన్ని చరిత్ర సత్యాలు. అంతే కదా మన పచ్చకల్లకు అనుకూలంగా మాట్లాడేవాడు గొప్ప విశ్లేషకుడు, వ్యతిరేకంగా మాట్లాడే వాడు చవకబారున్నర....మనం మాట్లాడిందే ఎప్పటికీ సత్యం.మనం ఇన్నాల్లూ పుస్తకాల్లో చదువుకున్న తెలుగుజాతి ఐక్యతకోసం పొట్టి శ్రీరాములు చనిపోయాడనేది గొప్ప సత్యం.

పచ్చకామెర్లు వచ్చిన కొందరికి తప్ప వేరెవరికి నచ్చని పచ్చబాబు రెండుకల్ల సిద్దాంతం మాత్రం గొప్ప నీతీ, నిజాయితీ, ధర్మం. ఇలాంటి రాతలు రాసేవాల్లందరూ నిజంగా తాము నమ్మినదాన్నే రాస్తారా.. ఏదో తమవర్గానికి కొమ్ముకాసేవారిని ఎలాగయినా సమర్ధించాలనేది వీరి తపన గానీ. అసలు తెలంగాణ లాంటి ఒక సున్నితమైన అంశంపై ఎక్కువమంది సాధారన ప్రజలకు ఏది మచిది అన్న కోణంలోనుండి కాకుండా రాష్ట్రాన్ని విభజిస్తే నాకు, నా సామాజిక వర్గానికి, నా అభిమాన రాజకీయ పార్టీకి, అభిమాన రాజకీయ నాయకుడికి ఎంత లాభం, ఎంత నష్టం అంటూ కూడికలూ తీసివేతలూ వేసేవారివలననే ఇలాంటి వాదోపవాదాలని నా అభిప్రాయం.

క్రికెట్ మాచ్ ఓడిపోతే?

మన క్రికెట్ జట్టు ఒక గెలవాల్సిన క్రికెట్ మాచ్ చివరిబంతుల్లో ఏదో బౌలర్ లేదా బాట్స్‌మన్ తప్పిదం వల్ల ఓడిపోతే అది క్రికెట్ అభిమానులందరినీ ఎంతో బాధిస్తుంది. అంతా ఒక జట్టు ఓడిపోయినట్లు గాక తామే ఓడిపోయినట్లు భావిస్తారు.అలాంటిది ఒక రాష్ట్రం ఏర్పాటు, కోట్లమంది ప్రజల ఆకాంక్ష చివరిదాకా వచ్చి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకుని చివరికి ఆ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతే ఎలా ఉంటుంది?

అది కూడా కొంతమంది స్వార్ధ నాయకులు, కొన్న్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ లాభాలకోసం మాటలు మార్చి, ధనబలంతో, మీడియా బలంతో, అధికార బలంతో, అంగబలంతో లేని ఉద్యమాలను పీసీ సర్కార్ కన్న గొప్పగా మాయాజాలం చేసి సృష్టించి ఆపితే ఎలా ఉంటుంది?

ఈబాధ ఇక్కడి ప్రజలను కలవరపరిచింది. ఈవోటమి ఇప్పటికే ఆరువందల ప్రాణాలు బలిగొంది. ఇప్పటిదాకా నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈప్రాంత ప్రజలతో ఆటలు ఆడుకుంటూ మాచ్‌ఫిక్సింగ్ చేస్తుంటే చూసిన ప్రజల సహనం నశించింది. ఇప్పుడు ప్రజలు తాము ఎంతకాలమూ ఆటలో పావులు కాదని తేల్చారు. దాని పరిణామమే ఇప్పుడు కాంగ్రేస్, తెలుగుదేశం నేతల్లో వణుకు. తెలంగాణ సాధించకపోతే తాము తమ నియోజకవర్గాల్లో మల్లీ అడుగుపెట్టలేని పరిస్థితి. తెరాసకు తాము గతంలో చెన్నారెడ్డిలాగా ప్రజలను వంచిస్తే ప్రజలు సహించరనే హెచ్చరిక.

ఎలాగయితేనేం, ఇప్పుడు ప్రజలు నాయకుల ఆటల్లో బొమ్మలు కావడం మాని నాయకులను శాసించే స్థితికి వచ్చారు. అందుకే ఇప్పుడు కాంగ్రేస్, తెలుగుదేశం ప్రతినిధుల రాజీనామాలు. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా చివరికి ఎలాగోలా గట్టి నిర్ణయం తీసుకున్న ఈనాయకులు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటే వెక్కిరించే సీమాంధ్ర నేతలు, మీడియా, మాస్వార్ధలాభంకోసం మీరు మాతో కలిసే ఉండాలి, విడిపోయే హక్కు మీకులేదంటూ మిడిసిపడే కుహనా సమైక్యవాదులూ అందరూ గిజగిజలాడడం ఖాయం. ఈనాయకులు ఎంతవరకూ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారనేదానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ కాంగ్రేస్, తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు నా అభినందనలు.