Sunday 2 January 2011

జలయగ్నం డొల్లతనం ఫలితం - క్రిష్ణా ట్రిబ్యునల్ తీర్పు

క్రిష్ణా ట్రిబ్యునల్ తాజా తీర్పు మన రాష్ట్రానికి అశనిపాతంలా మారింది. ప్రస్తుతం రాష్ర్ట్రంలో అంతా శ్రీక్రిష్ణ కమీషన్ రిపోర్టుకై ఎదురుచూస్తున్న తరుణంలో ఈ తీర్పు ఎక్కువగా మీడియాలో ప్రభావం చూపడం లేదు కానీ భవిష్యత్తులో రాష్ట్రం విడిపోయినా కలిసి ఉన్నా ఈ తీర్పు తెలంగాణాకూ సీమాంధ్రకూ గణనీయమైన నష్టం కలిగిస్తుందనేది నిస్సందేహం. అయితే ఇలాంటి తీర్పు రావడానికి కారణాలు ఏమిటి, అందులో మన పాలకుల నిర్వాకం, సరైన ప్రణాలికలేని మన జలయగ్నం యొక్క ప్రభావం ఎంతమేరకు ఉందనేది మనం గమనించాల్సిన విషయాలు.

నదీ జలాల వినియోగంపై హక్కులు ఆ నదీ పరివాహికప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) కే చెందుతాయనేది అంతర్జాతీయంగా పాటించబడుతున్న సూత్రం. క్రిష్ణా జలాల వినియోగంలో మనరాష్ట్రం మొదటినుంచీ ఈ సూత్రాన్ని తుంగలో తొక్కుతూ పెన్నా క్యాచ్మెంట్ ఏరియాకి క్రిష్ణా జలాలను తరలిస్తూ వస్తుంది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు విషయంలో మనరాష్ట్రం అభ్యంతరాలను తోసిపుచ్చుతూ అనేక సంవత్సరాలుగా కర్ణాటక చేస్తున్న వాదన కూడా ఇదే: నిభంధనలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ క్రిష్ణా జలాలను ఇతర నదీ ప్రవాహిక ప్రాంతాలకు తరలిస్తుందనేది. దీనికి మన రాష్ట్రం నుండి సరైన సమాధానం లేకపోవడంతో ఆల్మట్టి విషయంలో ఇంతకుముందే మనకు నష్టం జరిగింది.ఇప్పుడు అక్రమమన్న ఆల్మట్టి ఎత్తు చట్టబద్దం కాగా, ఇంకా ఎత్తు పెంచుకోవడానికి అనుమతి లభించింది. క్రిష్ణా నది క్యాచ్మెంటును ఈ క్రింది పటంలో చూడవచ్చు.




నిభంధనలకు వ్యతిరేకంగా ఇతర నదీ క్యాచ్మెంటు ఏరియాలకు క్రిష్ణాజలాలను తరలించడాన్ని మన రాష్ట్రం మేము మిగులు జలాలను మాత్రమే ఇతరక్యాచ్మెంట్ ఏరియాలకు తరలిస్తున్నామని సమర్ధించుకుంటుంది. అయితే నికరజలాల వాటాను వాడుకోకుండా మిగులు జలాలు ఎలా వాడుకుంటారనేది సందేహం. క్రిష్ణా పై చేపట్టిన ప్రాజెక్టులు ఈ క్రింది పటంలో చూడవచ్చు.



ఎవరైనా ముందు నికర హక్కులు కలిగిన ప్రాజెక్టులను ముందు పూర్తి చేసి జలాలను వినియోగంలోకి తీసుకుంటారు. ఆ తరువాత మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపడతారు. అయితే మన సమైఖ్య రాష్ట్రంలో నికరజలాలపై బచావత్ ట్రిబ్యునల్ హక్కులు కల్గిన శ్రీశైలం ఎడమకాలువ, భీమ లాంటి ప్రాజెక్టులను దశాబ్దాలు గడుస్తున్నా చేపట్టక, చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయక కాలం గడిపేస్తూ మిగులు జలాలపై మాత్రం ఆఘమేఘాలపై వెలిగొండ, హంద్రి-నీవా, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు చేపట్టింది.

మన రాష్ట్రంలో తెలంగాణా వారికి సమాధనం చెప్పేప్పుడు మాత్రం పోతిరెడ్డిపాడు, వెలిగొండ, హంద్రినీవా,గాలేరు-నగరి లాంటి ప్రాజెక్టులన్నీ మిగులు జలాలను మాత్రమే వాడుకుంటాయని చెప్పి క్రిష్ణా ట్రిబ్యునల్ దగ్గర అసలు మిగులు జలాలే లేవని రెండు నాల్కలధోరణి ప్రదర్శించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. మిగులు జలాల ఆధారంగా ఆంధ్రా ఇన్ని ప్రాజెక్టులను చేపడుతుందంటే మిగులు జలాలు చాలా ఎక్కువగా ఉంటాయనే అనుమానాలకు ఈ వాదన దారి తీసింది. ఈ విధంగా నికరజలాల హక్కులు కల్గిన తెలంగాణా ప్రాంతానికి మొండి చెయ్యిచూపించి అలా మిగిలిన "మిగులు" జలాలను సీమాంధ్రకు తరలిద్దామనుకున్న రాజశేఖరరెడ్డి పధకం రాష్ట్ర ప్రయోజనాలకే బెడిసికొట్టింది.పైగా అసలుకే ఎసరయ్యింది. జలయగ్నం ధనజలయగ్నం మాత్రమే కాదు, క్రిష్ణా జలాలను తెలంగాణాకు కాకుండా చేసే మహా పన్నాగం అన్న అనుమానాలను నిజం చేసింది.

4 comments:

  1. Very useful article, alongwith relevant pics. Thank you.

    ReplyDelete
  2. పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయన్న మాట!

    ReplyDelete
  3. కొత్తపాళీ, శ్రీకంతాచారి: ధన్యవాదాలు.

    ReplyDelete
  4. చక్కటి పోస్టు

    ReplyDelete