Thursday 17 February 2011

ఒక ఖండన, ఒక దండన

ఖండన:

ఈరోజు జయప్రకాష్ నారాయణ్ గారిపై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరం మరియూ గర్హణీయం. మన రాష్ట్ర శాసనసభలో విలువలూ, ఆదర్శాలూ, ఉన్నత భావాలూ కలిగిన వ్యక్తిగా చెప్పబడే జేపీకి ఇలాంటి అవమానం జరగడం అందరికీ అవమానమే. ఇలాంటి సంఘటన తెలంగాణా వాదానికి కూడా నష్టం జరిగించే విషయం. ఇలాంటి ఘటణలవలన ఉద్యమాం ప్రజలలో చులకన అయ్యే అవకాశం ఉంది.

చేతనయితే పూటకో మాట చెప్పి చివరికి కేంద్రప్రభుత్వ ప్రకటన రాగానే తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడిన చంద్రబాబుపైనో, లగడపాటి పైనో, జగన్‌పైనో, చిరంజీవిపైనో దాడిచేద్దాం. లేదా తెలంగాణాలో ఉంటూ ద్రోహం చేస్తున్న డీ.శ్రీనివాస్, జగ్గారెడ్డి లాంటివారిపై దాడి చేద్దాం. తెలంగాణా వచ్చినా రాకపోయినా తెలంగాణా ప్రజలకు కాస్త తృప్తి మిగులుతుంది, జేపీపై ఎందుకు దాడికి దిగడం? జేపీ తెలంగాణాపై పూటకో మాట చెప్పలేదు, తెలంగాణా ఏర్పాటుకు అడ్డుచెప్పలేదు.

దండన:

జేపీ గారూ, ఈరోజు మీపై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరం. అయితే ఇందులో మీరు ఆత్మ విమర్శ చేసుకావాల్సిన అవసరం కూడా ఉందేమో ఆలోచించండి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రతినిధిగా ఉన్న మీరు ఎప్పుడూ ఒక బ్యూరోక్రాట్‌లాగా ఎందుకు వ్యవహరిస్థారు? మీ మేధావితత్వం ముసుగులో వివక్షను ఎందుకు చూపుతారు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజల మనోభావాల ప్రకారం నడుచుకునే భాద్యత మీకు లేదా? అలా చెయ్యకపోతే ప్రజానాయకుడికి బ్యూరోక్రాట్‌కు తేడా ఏముంది? సీమాంధ్రలో ప్రజల రియాక్షన్‌తో సంబంధంలేకుండా నేతలు కృత్రిమ ఉద్యమం తయారు చేసి తెలంగాణాకు అడ్డుపడ్డరు. మీరిక్కడ ప్రజలంతా ఉద్యమిస్తుంటే ఏటికి ఎదురీది మీ నియోజకవర్గం కూడా వెల్లలేని పరిస్థితి తెచ్చుకోవడం ఎంతవరకూ సబబు?

మీరెప్పుడు ఆదర్శాలు వల్లిస్తారు, నీతులు చెబుతారు. అయితే మీ నీతివచనాలలో వివక్ష ఎందుకు? గత అసెంబ్లీ సమావేశాలలో అన్ని పార్టీలవారూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తే (సీమాంధ్ర ప్రతినిధులతో సహా) మీరు మాత్రం కేసులు ఎత్తివేయవద్దని వాదించారు. మరి సమైఖ్యాంధ్ర ఉద్యమం పేరుతో కేవలం పదిహేనురోజుల్లో కోట్ల ఆస్థుల ధ్వంసం జరిగినప్పుడు అక్కడ ఎవరిపైనా కేసులు ఎందుకు లేవు, అరెస్టులు ఎందుకు జరగలేదు అని మీరెందుకు ప్రశ్నించరు? అదే తెలంగాణాలో మాత్రం ఒక్కో విద్యార్థిపై వందలకొద్ది కేసులు ఎందుకు పెట్టారు, ఒకే సమయమ్ళొ వేర్వేరు చోట్ల కేసులు పెట్టడం ఎలా సాధ్యం? ఈ వివక్ష ఎందుకు అని ప్రశ్నించారా? మీరు చెప్పింది నిజం: నేరం చేసినట్టయితే కేసులు ఎందుకు ఎత్తివెయ్యాలి? కానీ ఆ నేరాల్ని నమోదు చెయ్యడంలోనే వివక్ష ఉంటే ఏమి చెయ్యడం?

అంతా చక్కగానే ఉంటే అసలు ఎలాంటి ఉద్యమాల అవసరం లేదు. కానీ ప్రస్తుత వ్యవస్థలో ఏదీ సరిగాలేదు. మీ నీతులు ఎందుకు సెలెక్టివ్‌గా ఉంటాయి? అధికారాన్ని పూర్తిగా గవర్నర్ హస్తగతం చేసుకుని శాసిస్తుండగా, హోం మినిష్టరు మాటలు ఖాతరు చెయ్యకుండా ఉస్మానియాలో కాల్పులకు ఆదేశాలు ఇవ్వగా అవేవీ పట్టకుండా గవర్నర్ ప్రసంగం విషయంలో మాత్రం నీతి వచనాలు ఎందుకు? మీరెప్పుడూ చెబుతుంటారు "21వ శతాబ్దంలో ఉద్యామాలా" అని, మరి 21వ శతాబ్దంలో కూడా ఉద్యమాలు చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించండి.

7 comments:

  1. సంయమనంతో ఉంది మీ వాదన.
    "మీరు మాత్రం కేసులు ఎత్తివేయవద్దని వాదించారు." - జేపీ చెప్పిన విషయం అపార్థానికి లోనయింది. మొత్తం అన్ని కేసుల్నీ గంపగుత్తగా ఎత్తి వెయ్యొద్దు అని అన్నాడంతే. శాంతియుత ఉద్యమం, ఊరేగింపు, దిష్టిబొమ్మల దహనం వగైరా కేసులు ఎత్తివెయ్యాలనే ఆయనా చెప్పాడు. కానీ, ఆస్తుల విధ్వంసం - ముఖ్యంగా ప్రైవేటు ఆస్తులు - కేసులలో మాత్రం ఎత్తివెయ్యొద్దని అన్నాడు. దాన్ని బాగా వక్రీకరించారు. కానీ, విమర్శకులు దాన్ని నేరుగా విమర్శించలేదు.. ఆయన అన్న మరొక మాటను అడ్డం పెట్టుకున్నారు. అదేంటంటే.. ఉద్యమాల పేరుతో కొందరు ప్రజల దగ్గర్నుండి డబ్బులు వసూలు చేసారంటూ ఆయన చేసిన ఆరోపణ.

    ReplyDelete
  2. బాగానే ఎవరిమీద దాడులు చేస్తే బాగుంటుందో చెప్పారు. అలాగే తెలంగాణా సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకొని బలవంతపు వసూళ్లు చేసి బతుకుతున్న దొర మీద, ఓ పక్క నాలుకలు కోస్తాం గట్ర లాంటి తాగుబోతు కబుర్లు మస్తుగా చెబుతూ, వాళ్లతో పొద్దున లేచినప్పటినుండి వ్యాపర లావాదేవీలు పెట్టుకొంటున్న అభినవ తెలంగాణా దొర మీద, దొర గడీ మీద దాడి ముందుగా చేయాలని మర్చేపోయారు !!! లేక మీరు దొరగారి కాల్మొక్కె బ్యాచేనా? నాకయితే మాత్రం మీ ఈ టపా దొరకు కాల్మొక్కుతూ నీ బాంచెన్ బాపతు లాగా కనబడలేదు :))

    ReplyDelete
  3. @చదువరి

    ధన్యవాదాలు. మీబ్లాగులో మీ టపాలు మాత్రం ఎప్పటిలాగానే పూర్తి పక్షపాతధోరణితో ఉన్నాయి.

    @క్రిష్ణ
    మా దొరలు చిల్లర మామూల్లే వసూలు చేస్తారు, మీదొరల్లా ఇంకా లక్షలకోట్లు దండుకొనే స్థాయి వారిది కాదు లెండి. నాకు సలహా ఇచ్చినట్లే సమైఖ్యవాద బ్లాగర్లదగ్గరికెల్లి అక్కడి కబ్జాదొరల దొంగ ఉద్యమాలగురించి రాయమనండి.

    ReplyDelete
  4. JP తాను తెలంగాణ/సమైఖ్యాంధ్ర కోసం పోరాడతా అని కాని, అనుకూలం అనికాని, వ్యతిరేకం అని కాని చెప్పి ఎవరి దగ్గర మోసం చేసి వోట్లు వేయించుకోలేదు. ఆయన ఎవరి మీదా వివక్ష చూపలేదు,తప్పు చేస్తే ఈ ప్రాంతం గాని, ఆ ప్రాంతం గాని ఖటినంగా శిక్షిచాలి అని స్పష్టం గా చెప్పారు. అక్కడ కేసుల్లేవని మీరెలా అనుకుంటున్నారు? ఏమిటీ ప్రజల మనోభావాలు అంటూ అంతా గందరగోళం చేసే ప్రయత్నం? వెనకటికి మా వూర్లో అనే వాళ్ళు.. "గ్రామం చెప్పింది" అని.. వైయస్సార్ చనిపోయిన తర్వాతా రాత్రికి రాత్రి ప్రజల మనోభావాలు మారిపోయాయా? ఇవాళ కూకట్పల్లి లో జరిగిన ర్యాలి చూస్తే తెలుస్తుంది ఆయన నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా పోతున్నడా లేదా అనేది?

    వ్యవస్థ లో అన్ని సక్రమంగా లేవనే ఆయన కూడా చెప్తుంది.. అంత మాత్రన ఉన్న వాటిని నాశనం చేసుకోవాలా? ఆయన కోరుకునేది కూడా వ్యవస్థ లో మార్పు రావాలి కాని రాష్ట్ర సరిహద్దులు మారినందువల్ల ప్రయోజనం లేదనేగా.

    ReplyDelete
  5. మొత్తానికి "చిల్లర" దొరల, "చిల్లర" ఉద్యమం అంటారు, అలాగే!!

    పై కామెంట్ లో నేను నిజంగానే ఈ టపా వరకూ మిమ్ములను పొగిడానండి, కాకపోతే పిట్టలదొర గురించి మరచిపోయారేమిటా అని మాత్రం అనుకొన్నా!! నేను సమైక్యవాదినే అనుమానం లేదు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం లో (ఖమ్మం లో ) పుట్టిన వాడిని.

    మీ కోరిక, ఉద్యమం, మన తెలంగాణా పిట్టల దొరలను, లక్ష కోట్ల దొరలు గా వాళ్లకు కాల్మొక్కుత్తూ సాగించాల్సిందే అంటే, చెప్పేది ఏమీ లేదు :)

    ReplyDelete
  6. @క్రిష్న

    ఏం? లక్షల కోట్లకు ఎసరు పెట్టేవారు చేస్తేగానీ ఉద్యమం మీకంటికి ఆనదా? మీరే ప్రాంతం వారయినా మీరు పెద్ద గజదొంగల కాల్లు మొక్కాల్సిందే. ప్రస్థుతానికి నామాకో లేక రేణుకా చౌధరికో మొక్కి పబ్బం గడుక్కోండి. చెప్పేదేం లేదు.ఏ కేసీఆర్నో విమర్శిస్తే ఉద్యమం పలుచనయిపోద్దనుకోవడం మూర్ఖత్వం.

    ReplyDelete
  7. సత్యాన్వేషి: :) మీకు నచ్చనిదల్ల్లా పక్షపాత ధోరణిలో కనిపించడంలో ఆశ్చర్యమేమున్నదిలెండి.

    ReplyDelete